IRE vs IND: సంజుని లేపేసి వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వాల్సింది.. జస్ట్ నాట్ హ్యాపీ!

IRE vs IND: Sanjay Manjrekar on Vaibhav Sooryavanshi Snub. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కూడా వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.

Update: 2026-06-28 14:15 GMT

IRE vs IND: సంజుని లేపేసి వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వాల్సింది.. జస్ట్ నాట్ హ్యాపీ!

IRE vs IND: ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కూడా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నమ్మకం ఉంచారు. దాంతో వైభవ్‌కు ఛాన్స్ లేకుండా పోయింది.

ప్లేయింగ్ 11లో వైభవ్‌కు చోటు దక్కకపోవడంతో మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి టీ20లో ఓటమి తర్వాత భారత జట్టు బ్యాటింగ్‌లో మార్పులు అవసరమని భావించిన మంజ్రేకర్.. రెండో టీ20లో వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడం సరైన క్రికెటింగ్ నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు.

బెల్‌ఫాస్ట్‌లో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ ఆల్‌రౌండర్ సుర్యాంశ్‌ షెడ్గే, పేసర్ ప్రిన్స్ యాదవ్ టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. వైభవ్ సూర్యవంశీ మాత్రం మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నిర్ణయంపై స్పందించిన సంజయ్ మంజ్రేకర్.. టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టాడు.

సోనీ స్పోర్ట్స్‌లో మాట్లాడిన మంజ్రేకర్.. 'నేను వైభవ్ అభిమానిగా మాత్రమే మాట్లాడడం లేదు. తొలి టీ20లో భారత్‌కు అసలు సమస్య మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. ఓపెనర్లు మాత్రమే పరుగులు చేస్తే సరిపోదు. వారి తర్వాత వచ్చే బ్యాటర్లు కూడా రాణించాలి. ఆ లోటును పూడ్చేందుకు జట్టుకు మరో స్వచ్ఛమైన బ్యాటర్ అవసరం ఉంది. అలాంటి సమయంలో వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సింది' అని అన్నాడు.

వైభవ్‌ సూర్యవంశీని జట్టులోకి తీసుకొచ్చే సరైన మార్గం కూడా మంజ్రేకర్ వివరించాడు. 'వైభవ్‌ను ఓపెనర్‌గా ఆడించి, సంజు శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌కు పంపి ఉంటే జట్టుకు మంచి సమతుల్యత వచ్చేది. ఆ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. కానీ అలా చేయకపోవడం నాకు అస్సలు నచ్చలేదు. వైభవ్ ఓపెనింగ్ చేయాలని నేను కోరుకున్నా. టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం నాకు నచ్చలేదు. జస్ట్ నాట్ హ్యాపీ' అని పేర్కొన్నాడు.

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి అవకాశం దక్కకపోవడంతో అభిమానులు కూడా సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి టీ20లో ఎదురైన అనూహ్య ఓటమి తర్వాత కూడా టాప్ ఆర్డర్‌లో మార్పులు చేయకుండా అదే కాంబినేషన్‌కు అవకాశం ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

రెండో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వాతావరణ పరిస్థితులు, వర్షం వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నామని, పరిస్థితులకు త్వరగా అలవాటు పడుతూ తెలివైన క్రికెట్ ఆడటమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు.

Tags:    

Similar News