Abhishek Sharma: అతడి వల్లే నా బ్యాటింగ్ పూర్తిగా మారింది.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Abhishek Sharma: ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లలో 380 రన్స్ చేశాడు.
Abhishek Sharma: అతడి వల్లే నా బ్యాటింగ్ పూర్తిగా మారింది.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Abhishek Sharma: ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లలో 212కు పైగా స్ట్రైక్ రేట్తో 380 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం జట్టులో రెండవ అత్యధిక పరుగుల స్కోరర్గా, ఆరెంజ్ క్యాప్కు ప్రధాన పోటీదారుగా ఉన్నాడు. ప్రస్తుతం అదిరిపోయే ఫామ్లో ఉన్న అభిషేక్ తన బ్యాటింగ్ శైలిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తన ఆటపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రభావం ఎంతో ఉందని వెల్లడించాడు. హెడ్ దూకుడు, ఆత్మవిశ్వాసం తనను ఎంతో ప్రభావితం చేశాయని అభిషేక్ తెలిపాడు.
జియో స్టార్తో మాట్లాడిన అభిషేక్ శర్మ.. ట్రావిస్ హెడ్ ఆటను అతను ఎస్ఆర్హెచ్లో చేరకముందే గమనిస్తున్నానని చెప్పాడు. 'సన్రైజర్స్లో చేరడానికి ఏడాదిన్నర ముందు నుంచే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ను ఫాలో అవుతున్నాను. అతను మా జట్టులో చేరినప్పుడు చాలా సంతోషించాను. అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం నాకు మంచి అవకాశం. నేను మొదటగా అతడిని అడిగింది అతని బ్యాటింగ్ మైండ్సెట్ గురించే. హెడ్ ఒకటే చెప్పాడు. బంతిని బాగా గమనించాలని సలహా ఇచ్చాడు. మొదటి బంతినే కొట్టగలనని అనిపిస్తే వెంటనే దాడి చేయాలి అన్నాడు. ఐపీఎల్కు ముందు ప్రాక్టీస్లోనే నేను ఈ విధానాన్ని ఫాలో అయ్యాను' అని వెల్లడించాడు.
ఇప్పుడు తన ఆటలో కూడా అదే దూకుడు కనిపిస్తోందని అభిషేక్ శర్మ చెప్పాడు. 'ఇప్పుడు నా జోన్లోకి బంతి వస్తే మొదటి బంతి నుంచే హిట్ చేయాలని చూస్తాను. ఐపీఎల్ లీగ్ ప్రపంచంలోనే టాప్ టోర్నమెంట్. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లతో కలిసి ఆడటం గొప్ప అనుభవం. ప్రతి ఐపీఎల్ సీజన్ నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్ లాంటిది. టాప్ ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటాం' అని అభిషేక్ అన్నాడు. ఐపీఎల్ 2026లో అభిషేక్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ (400 పరుగులు) తర్వాత స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతంమ్యాచ్లో ముంబై ఇండియన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఢీకొడుతోంది. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ముంబై 15 ఓవర్లకే 181 రన్స్ చేసింది. రయాన్ రికెల్టన్ సెంచరీ బాదాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో పరుగుల వరద పారించాడు. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్ రేసులో కీలకంగా మారనుంది. అభిషేక్-ట్రావిస్ హెడ్ జోడి మరోసారి అద్భుత ఆరంభం ఇస్తుందా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.