Viral Video: సమోసా క్రేజ్.. కారు కాదు ఏకంగా రైలునే ఆపేసిన లోకో పైలట్!
Viral Video: మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సమోసాలు కొనడం కోసం ఒక లోకో పైలట్ ఏకంగా రైలునే ఆపేశాడు.
Viral Video: సమోసా క్రేజ్.. కారు కాదు ఏకంగా రైలునే ఆపేసిన లోకో పైలట్!
Viral Video: ఆకలి వేస్తే హోటల్ దగ్గర బైకో, కారో ఆపడం మనకు తెలుసు.. కానీ ఓ లోకో పైలట్ మాత్రం తనకు సమోసాలు తినాలనిపించి ఏకంగా నడుస్తున్న రైలునే ఆపేశాడు! ప్రయాణికుల భద్రతను పక్కన పెట్టి, కేవలం సమోసాల కోసం రైలును నిలిపివేసిన ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను ఊపేస్తోంది.
ఇందౌర్లోని రంగ్వాసా ప్రాంతంలో ఒక రైలు వెళ్తోంది. అయితే అక్కడ రైల్వే స్టేషన్ గానీ, సిగ్నల్ పాయింట్ గానీ లేవు. అయినా కూడా లోకో పైలట్ సడన్గా రైలును అక్కడే నిలిపివేశాడు. రైలు ఆగీఆగడంతోనే లోకో పైలట్ కిందికి దిగి, రైల్వే ట్రాక్కు సమీపంలోనే ఉన్న ఒక తినుబండారాల దుకాణానికి (స్వీట్ షాప్) వెళ్లాడు. అక్కడ వేడివేడి సమోసాలను పార్సిల్ కట్టించుకుని, మళ్లీ దర్జాగా వచ్చి రైలు ఎక్కాడు. ఆ తర్వాత హారన్ కొట్టి రైలును ముందుకు కదిలించాడు.
రైలు అలా రోడ్డు పక్కన ఆగడం, డ్రైవర్ దిగి వెళ్లి సమోసాలు కొనడాన్ని గమనించిన స్థానికులు దాన్ని వీడియో తీశారు. "సమోసాల కోసం రైలును ఆపడం ఏంటి సామీ?" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు లోకో పైలట్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటూ, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని మండిపడుతున్నారు. సదరు లోకో పైలట్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియో కాస్తా రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. రైలును ఎందుకు ఆపాల్సి వచ్చింది? దానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) ముఖేష్ వెల్లడించారు. రైల్వే నిబంధనలను ఉల్లంఘించి, సమోసాల కోసమే రైలు ఆపినట్లు రుజువైతే సదరు లోకో పైలట్పై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.