Prakasam: ప్రజల చెంతకు కలెక్టర్.. పోతవరంలో రాజాబాబు 'పల్లె నిద్ర'!
Prakasam: ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు వినూత్న రీతిలో 'పల్లె నిద్ర' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Prakasam: ప్రజల చెంతకు కలెక్టర్.. పోతవరంలో రాజాబాబు 'పల్లె నిద్ర'!
Prakasam: ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామంలో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 'పల్లె నిద్ర' కార్యక్రమం ఈ గ్రామంలో జరిగింది. జిల్లా పరిపాలనా యంత్రాంగం ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి పోతవరం గ్రామం ఆతిథ్యమిచ్చింది. ఈ పల్లె నిద్రలో భాగంగా, జిల్లా కలెక్టర్ రాజాబాబు స్వయంగా గ్రామంలో బస చేసి, అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే సంకల్పంతో ఆయన గ్రామస్థులతో మాటామంతీ జరిపారు.
సాయంత్రం గ్రామ వీధుల్లో పర్యటించి అక్కడి ప్రజల కష్టాలను ఆలకించారు. గ్రామంలోని తాగునీటి సమస్య, రోడ్ల మరమ్మతులు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, సాగునీటి కొరత వంటి అనేక అంశాలపై గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలన్నింటినీ కలెక్టర్ అత్యంత శ్రద్ధగా ఆలకించి, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.గ్రామ ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను కలెక్టర్ రాజాబాబు తక్షణమే పరిశీలించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి , రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ సంబంధిత సమస్యలపై వ్యవసాయాధికారులతో చర్చించి, రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలు విన్న గ్రామస్థులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. తమ సమస్యలకు తక్షణమే పరిష్కారం లభించడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువవుతుందని, సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని కలెక్టర్ రాజబాబు తెలిపారు.