Telegram : టెలిగ్రామ్కు షాక్.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..!
Telegram : నీట్-యూజీ 2026 (NEET-UG 2026) రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' (Telegram) పై కేంద్ర ప్రభుత్వం విధించిన..
Telegram-Delhi-Highcourt
Telegram : నీట్-యూజీ 2026 (NEET-UG 2026) రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' (Telegram) పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పరీక్షల్లో అక్రమాలను, పేపర్ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని, ఇది హేతుబద్ధంగానే ఉందని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన బ్లాకింగ్ ఆర్డర్లను సవాలు చేస్తూ టెలిగ్రామ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కారియా తో కూడిన బెంచ్ కొట్టివేసింది.
కోర్టు తీర్పు.. ప్రభుత్వం వైఖరి ఏంటి.?
ఐటీ చట్టం, 2000 లోని సెక్షన్ 69A కింద కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధాన్ని విధించింది. దీనిపై తీర్పునిస్తూ న్యాయస్థానం.. "పరీక్షల పారదర్శకతను కాపాడటానికి ప్రభుత్వం తీసుకున్న అత్యంత తక్కువ కఠినమైన మార్గం ఇది. కాబట్టి ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధం అని చెప్పలేం" అని వ్యాఖ్యానించింది. మే 3న జరిగిన అసలు నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల వల్ల రద్దవడంతో, ప్రస్తుతం సీబీఐ (CBI) ఈ లూటీపై దర్యాప్తు చేస్తోంది. మళ్లీ రీ-ఎగ్జామ్ సమయంలో వ్యవస్థీకృత చీటింగ్ ముఠాలు టెలిగ్రామ్ను వేదికగా చేసుకోకుండా ఉండేందుకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సుల మేరకు జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) నిర్ణయం తీసుకుంది. అలాగే పాత మెసేజ్లను ఎడిట్ చేసే ఆప్షన్ను కూడా జూన్ 30 వరకు నిలిపివేయాలని ఆదేశించింది.
టెలిగ్రామ్ వాదన.. మమ్మల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు.?
టెలిగ్రామ్ తరపున సీనియర్ న్యాయవాది ధృవ్ మెహతా కోర్టులో వాదనలు వినిపిస్తూ.. మిగిలిన సోషల్ మీడియా యాప్స్ అన్నీ నడుస్తున్నప్పుడు కేవలం టెలిగ్రామ్ను మాత్రమే టార్గెట్ చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని అన్నారు. ప్రభుత్వం జూన్ 9న కొన్ని లింకులను (URLs) షేర్ చేసిన గంటలోనే వాటిని తొలగించామని, ఇప్పటివరకు నీట్ అక్రమాలకు సంబంధించిన 900 కి పైగా లింకులను ఏఐ (AI), హ్యూమన్ మోడరేషన్ ద్వారా డిలీట్ చేశామని కంపెనీ తెలిపింది. "దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం కలుగుతుందనే నెపంతో ఈ నిషేధం విధించారు. నీట్ లాంటి ఒక పరీక్ష దేశ సార్వభౌమత్వాన్ని ఎలా దెబ్బతీస్తుంది? అధికారులు అసలు ఆలోచించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు" అని టెలిగ్రామ్ లాయర్ వాదించారు.
కేంద్రం కౌంటర్.. టెలిగ్రామ్ ఒక 'ఫ్రాంకెన్స్టైన్'
కేంద్ర ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిలు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. టెలిగ్రామ్ అంతర్గత డిజైన్ (Architecture), ప్రైవసీ పాలసీ వల్ల అక్రమాలను అడ్డుకోవడం చాలా కష్టమని, అకౌంట్ డిలీట్ చేస్తే అందులోని డేటా మొత్తం మాయమైపోతుందని, దీనివల్ల నేరస్థులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. అటార్నీ జనరల్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. "టెలిగ్రామ్ అనేది దాని ఆర్కిటెక్చర్ వల్ల ఒక 'ఫ్రాంకెన్స్టైన్' (నియంత్రించలేని రాక్షసి) లాగా మారింది. భారతదేశం లాంటి పెద్ద దేశం పరీక్షల లీకేజీలను ఆపడానికి ముందస్తు రక్షణ చర్యలు తీసుకోకపోతే ఎలా? కేవలం డబ్బు కోసం నడిచే ఒక ప్లాట్ఫారమ్ వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడం హాస్యాస్పదం" అని వాదించారు. రెండు వైపుల సుదీర్ఘ వాదనలను విన్న ఢిల్లీ హైకోర్టు, పరీక్షల సమగ్రతను , లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ముందస్తు నిషేధ చర్యల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ కేసును ముగించింది.