Kurnool: అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి టి.జి. భరత్!

Kurnool: నూతన బైపాస్ రహదారి, కొండారెడ్డి బురుజు ప్రొజెక్షన్ స్క్రీన్‌లను రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ బుధవారం ప్రారంభించనున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

Update: 2026-08-04 16:30 GMT

Kurnool: అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి టి.జి. భరత్!

కర్నూలు: నగరంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో నగరపాలక సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకోనుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. మంగళవారం ఆయన నగరంలో పూర్తి అయిన కీలక అభివృద్ధి పనులను పరిశీలించి, తుది ఏర్పాట్లను సమీక్షించారు.

మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. నగర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ఆధునికీకరించిన చారిత్రాత్మక గడియారం ఆసుపత్రి, చౌరస్తా వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ఆంజనేయస్వామి ఆలయం వెనుక నిర్మించిన నూతన బైపాస్ రహదారి, అలాగే కొండారెడ్డి బురుజు ఓపెన్ థియేటర్ పార్కులో ఏర్పాటు చేసిన ఔట్‌డోర్ ప్రొజెక్షన్ స్క్రీన్‌ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ బుధవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు.

గడియారం ఆసుపత్రి ఆధునికీకరణతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, నూతన బైపాస్ రహదారితో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయని పేర్కొన్నారు. కొండారెడ్డి బురుజు ఓపెన్ థియేటర్ పార్కులో ఏర్పాటు చేసిన ఔట్‌డోర్ ప్రొజెక్షన్ స్క్రీన్ ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక, వినోదాత్మక ప్రదర్శనలు నిర్వహించే అవకాశం కలుగుతుందన్నారు.

అదేవిధంగా విజయలక్ష్మి నగర్‌లో డ్రైనేజీ సమస్యను పరిశీలించి, శాశ్వత పరిష్కారం కోసం నూతన డ్రైనేజీ కాలువ నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పరిమళ నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసి, ప్రజలకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందేలా చర్యలు కొనసాగించాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఏసీపీ నాగరాజు, డీఈఈ శ్రీనివాసన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రవి, మునిస్వామి, వలి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News