Kothagudem: PRC వెంటనే ప్రకటించాలి: కొత్తగూడెంలో TGEJAC నేతల డిమాండ్!

Kothagudem: కొత్తగూడెంలో TGEJAC విలేకరుల సమావేశం. పీఆర్సీ ప్రకటన, డీఏలు, సీపీఎస్ రద్దు కోరుతూ ఈ నెల 27 నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతామని వెల్లడి.

Update: 2026-08-26 08:18 GMT

Kothagudem: PRC వెంటనే ప్రకటించాలి: కొత్తగూడెంలో TGEJAC నేతల డిమాండ్!

Kothagudem: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, వర్కర్ల ఐక్యవేదిక TGEJAC ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తగూడెంలోని TSUTF జిల్లా కార్యాలయం టీచర్స్ భవన్‌లో TGEJAC చైర్మన్ అమరనేని రామారావు, కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు న్యాయబద్ధంగా రావాల్సిన అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని నాయకులు తెలిపారు. ముఖ్యంగా 01-07-2023 నుంచి అమలు కావాల్సిన పే రివిజన్ కమిటీ (PRC) నివేదికను వెంటనే తెప్పించుకొని PRCని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే ప్రకటించాలని, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు.

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ (CPS)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల పథకాన్ని పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఐదేళ్లకోసారి ఉద్యోగులకు PRC ప్రకటించాల్సి ఉండగా, 01-07-2023 నుంచి PRC పెండింగ్‌లో ఉండటం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వంతో సమానంగా DA, DR ప్రకటించాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల కోసం ప్రతినెలా రూ.2,000 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

PRC ప్రకటించేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీ నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వర్కర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని తెలిపారు. వచ్చే నెల 10న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పెండింగ్‌లో ఉన్న అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు కోరారు. ఈ నెల 27న జరిగే ధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి. రాజు, TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, ఎస్. వెంకటేశ్వర్లు, PRTU TS జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్. ప్రభాకర్ రావు, PRTU TG జిల్లా అధ్యక్షులు బి. రవి, బి. సీతారాములు, పెన్షనర్ సంఘ జిల్లా అధ్యక్షులు ఈజీఆర్ వెస్లీ, TRTF జిల్లా అధ్యక్షులు జి. దుర్గయ్య, TSTTF జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. బాలకృష్ణ, TNGO పట్టణ అధ్యక్షులు విజయలక్ష్మి, TNGO వైస్ ప్రెసిడెంట్ జి. ఉష, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దినేష్, డ్రైవర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు భగవాన్ రెడ్డి, JL అసోసియేషన్ అధ్యక్షులు బండి వెంకటేశ్వర్లు, TGO బాధ్యులు మూర్తి, రాజేష్ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News