Madanapalle: బీసీ హాస్టల్ను రాయచోటికి తరలించవద్దు: బహుజన యువసేన!
Madanapalle: మదనపల్లె బీసీ హాస్టల్ను రాయచోటికి తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలని జిల్లా సంక్షేమ శాఖకు బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ వినతిపత్రం ఇచ్చారు.
Madanapalle: బీసీ హాస్టల్ను రాయచోటికి తరలించవద్దు: బహుజన యువసేన!
మదనపల్లె, ఆగస్టు 1: అన్నమయ్య జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న బీసీ హాస్టళ్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మదనపల్లె బీసీ హాస్టల్ను రాయచోటికి తరలించే ప్రతిపాదనను వెంటనే విరమించాలని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షులు జి. పునీత్ కుమార్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు జిల్లా బీసీ సంక్షేమ అధికారి అందుబాటులో లేకపోవడంతో, జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ ధీరజ్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ, మదనపల్లె జిల్లా ప్రధాన కేంద్రం కావడంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి వందలాది మంది పేద బీసీ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇక్కడికి వస్తున్నారని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో బీసీ హాస్టల్ను రాయచోటికి తరలిస్తే విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా, పలువురు విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేసే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల మదనపల్లె బీసీ హాస్టల్ను యథాతథంగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల సిఫారసు చేయాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖను కోరినట్లు తెలిపారు.
బీసీ విద్యార్థుల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మదనపల్లె బీసీ హాస్టల్ను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.