Iran Vs USA : సముద్రంలో యుద్ధ జ్వాలలు.. . అమెరికా, ఇరాన్ సైనిక చర్యలతో వణుకుతున్న ప్రపంచ దేశాలు
Iran Vs USA : హోర్ముజ్ జలసంధిలోని మస్కట్ తీరంలో చమురు నౌకపై రహస్య పేలుడు సంభవించింది. అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్, ఇరాన్ స్మార్ట్ కంట్రోల్ చర్యలతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరిగాయి.
Iran Vs USA
Iran Vs USA : పశ్చిమ ఆసియాలో కొద్దిరోజుల క్రితం కుదిరిన శాంతి ఒప్పందాలు, కాల్పుల విరమణ ఆశలు ఒక్కసారిగా అల్లకల్లోలమయ్యాయి. ప్రపంచ దేశాల వాణిజ్యానికి, ముఖ్యంగా అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మరోసారి మహా యుద్ధానికి కేంద్రబిందువుగా మారేలా కనిపిస్తోంది. ఒమన్ దేశపు మస్కట్ తీరానికి సమీపంలో అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఒక భారీ కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్ పై రహస్య పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి సముద్రంలో భారీగా ఇంధనం లీకవుతుండటంతో పాటు ఆకాశాన్ని కమ్మేసిన నల్లటి పొగలు మిడిల్ ఈస్ట్లో సరికొత్త యుద్ధ మేఘాలను సృష్టిస్తున్నాయి. ఈ దాడికి తామే కారణమంటూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించనప్పటికీ.. అమెరికా, ఇరాన్ దేశాలు ఈ ఘటనకు ఒకరినొకరు నిందించుకుంటూ సముద్రంలో బలాబలాల ప్రదర్శనకు దిగాయి.
ఈ చమురు నౌకపై జరిగింది సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమా లేక డ్రోన్లు, మిస్సైళ్లతో జరిగిన వ్యూహాత్మక దాడా అనే కోణంలో అంతర్జాతీయ నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. అయితే హోర్ముజ్ జలసంధిలో అమెరికా మిలిటరీ జోక్యం పెరగడం వల్లే.. ఇరాన్ పక్కా ప్లాన్తో ఈ ప్రతీకార దాడికి పాల్పడి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ ఒక్క పేలుడుతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సముద్ర రవాణా ప్రమాదకరంగా మారడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ఓడల ప్రీమియం ధరలను ఆకాశానికి పెంచేశాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే గ్లోబల్ ఎనర్జీ సప్లై చైన్ పూర్తిగా దెబ్బతిని, ప్రపంచ అగ్రరాజ్యాలు నేరుగా యుద్ధరంగంలోకి దూకడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సముద్రపు బిగ్ ఫైట్లో ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. హోర్ముజ్ జలసంధిపై పూర్తి సైనిక నియంత్రణ సాధించడమే అమెరికా, ఇజ్రాయెల్లకు చెక్ పెట్టడానికి తమకున్న అతిపెద్ద బ్రహ్మాస్త్రమని టెహ్రాన్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ ఆర్మీ (IRGC) హోర్ముజ్ సముద్ర మార్గంలో హైటెక్ స్మార్ట్ కంట్రోల్ చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి వెళ్లే ఏ వాణిజ్య నౌక అయినా సరే, తమ అనుమతి లేకుండా ముందుకు కదలడానికి వీల్లేదంటూ నో పర్మిట్, నో ప్యాసేజ్ అనే కఠినమైన రూల్ను అమలు చేస్తోంది. గత 24 గంటల్లో కనీసం 25 చమురు నౌకలు తమ స్మార్ట్ చెకింగ్ దాటాకే హోర్ముజ్ దాటాయని ఇరాన్ ప్రకటించింది. కాగితాలపై కుదిరే శాంతి ఒప్పందాలను తాము నమ్మమని, ప్రపంచ దేశాల చమురు నాడులను కట్ చేసే పవర్ తమ చేతుల్లోనే ఉందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ వర్గం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. దీనికి తోడు ఇరాన్ జాతీయ భద్రతా మండలి డిప్యూటీ సెక్రటరీ అలీ బఘేరి అత్యవసరంగా రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి అమెరికాపై మరింత ఒత్తిడి పెంచడం గమనార్హం.
మరోవైపు ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అమెరికా రక్షణ శాఖ (పెంటాగన్) తెరవెనుక పక్కా స్కెచ్ వేసింది. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే నెపంతో, ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే అత్యంత రహస్య సైనిక ఆపరేషన్ను అమెరికన్ నేవీ ప్రారంభించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వాషింగ్టన్ తన అమ్ములపొదిలోని సైలెంట్ మిలిటరీ డాక్ట్రిన్ వ్యూహాన్ని ఇక్కడ అమలు చేస్తోంది. అంటే ఒకవైపు చర్చల పేరుతో ఇరాన్ను బిజీగా ఉంచుతూనే.. మరోవైపు అమెరికా నౌకాదళం యుద్ధ నౌకల సాయంతో హోర్ముజ్ జలసంధి పై పట్టు సాధిస్తోంది. ఇటీవల 20 లక్షల బారెళ్ల ముడి చమురుతో వెళ్తున్న ఒక గ్రీక్ సూపర్ట్యాంకర్ను అమెరికా సైన్యమే స్వయంగా రక్షణ కల్పించి సురక్షితంగా హోర్ముజ్ దాటించడం ఈ ఆపరేషన్కు బలాన్ని చేకూరుస్తోంది. ప్రపంచ అగ్రరాజ్యాలు ఈ సముద్ర మార్గం కోసం ఢీకొడుతుండటంతో ప్రపంచం మరో ఖచ్చితమైన ప్రపంచ యుద్ధం ముంగిట నిలిచినట్లయింది.