Ghatkesar: ఇళ్లలో నీరు నిల్వ ఉంటే కఠిన చర్యలు.. కమిషనర్ వార్నింగ్!
Ghatkesar: మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ఘట్కేసర్ సర్కిల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు.
Ghatkesar: ఇళ్లలో నీరు నిల్వ ఉంటే కఠిన చర్యలు.. కమిషనర్ వార్నింగ్!
ఘట్ కేసర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలో శుక్రవారం విస్తృతంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అధికారులతో కలిసి పలు కాలనీలను సందర్శించిన ఆయన, స్థానిక ప్రజలతో సమావేశమై ఫ్రైడే డ్రై డే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గృహాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల లార్వా నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు.
జోడిమేట్ల, మిరాలం కుంట ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను పరిశీలించిన కమిషనర్, యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ను పెద్ద ఎత్తున చేపట్టి దోమల పెరుగుదలను అరికట్టాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం శిల్పా నగర్ పార్క్ను సందర్శించిన ఆయన, స్వయం సహాయక సంఘాలకు శిక్షణ ఇచ్చి పార్క్ నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. నాగారం డివిజన్ లో గుర్రపు డెక్క తొలగింపు పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి, వివిధ శాఖల అధికారులు, సానిటేషన్ సిబ్బంది, స్థానిక కాలనీల ప్రజలు పాల్గొన్నారు.