LB Nagar: పోలీస్ స్టేషన్ వద్ద కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల ధర్నా!
LB Nagar: ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్య. ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
LB Nagar: పోలీస్ స్టేషన్ వద్ద కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల ధర్నా!
LB Nagar: ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ జె. సాయికుమార్ (PC 13128) బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్రూమ్లో ఉరివేసుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
2024 బ్యాచ్కు చెందిన సాయికుమార్ ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కర్మన్ఘాట్లో స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల ఆందోళన.. ఉద్రిక్తత
సాయికుమార్ మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. “సాయికుమార్ ఆత్మహత్య చేసుకోలేదు.. రక్తపు మరకలు ఎలా వచ్చాయి?” అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో భారీగా జనసమీకరణ జరిగింది.
ఒక దశలో ఆందోళనకారులు పోలీస్స్టేషన్లోకి దూసుకెళ్లి కంప్యూటర్, ప్రింటర్ తదితర సామగ్రిని ధ్వంసం చేసినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. సాయికుమార్ మృతికి అసలు కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఉన్నతాధికారుల వేధింపులే కారణమా?
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూరు అజినతండకు చెందిన సాయికుమార్ మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకే సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.