LB Nagar: ఎల్బీనగర్లో ఘనంగా ‘జాగో ఎల్బీనగర్ ధర్మరక్షణ సభ’!
LB Nagar: ఎల్బీనగర్లో ‘జాగో ఎల్బీనగర్ ధర్మరక్షణ సభ’ హిందూ ఐక్యత, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహంపై ఉత్సవ సమితి పిలుపు.
LB Nagar: ఎల్బీనగర్లో ఘనంగా ‘జాగో ఎల్బీనగర్ ధర్మరక్షణ సభ’!
LB Nagar: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన జాగో ఎల్బీనగర్ ధర్మరక్షణ సభ’ లో హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహంపై వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి , ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వేనిపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పవన్, నరసింహారెడ్డి, మొద్దు లచ్చిరెడ్డితో పాటు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గణపతి మండపం అంటే ఉద్యమమే
రావినూతల శశిధర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను కేవలం పండుగగా కాకుండా హిందూ సమాజాన్ని ఏకం చేసే ఉద్యమంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఛత్రపతి శివాజీ, బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో భాగ్యనగర్లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దశాబ్దాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు.
ప్రతి గల్లీలో ఏర్పాటు చేసే గణేష్ మండపం ద్వారా హిందూ సమాజం ఐక్యంగా ఉండాలనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతి కుటుంబం, ప్రతి మండపం, ప్రతి ఆలయంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
స్వదేశీ వస్తువులనే కొనాలి
హిందువుల సంప్రదాయ వృత్తులు, ఉపాధిని కాపాడేందుకు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని శశిధర్ పిలుపునిచ్చారు. గణేష్ మండపాలు, దేవాలయాలు, పండుగలు, కుటుంబ వేడుకల్లో వినియోగించే పూజా సామగ్రిని స్థానికంగా తయారు చేసే వారి వద్దే కొనుగోలు చేయాలని సూచించారు.
హిందూ కులవృత్తులను కాపాడుకోవడం ద్వారా స్థానిక ఉపాధికి అండగా నిలవాలని అన్నారు. ప్రతి దేవాలయం ఒక శక్తి కేంద్రంగా, ప్రతి గణేష్ మండపం సామాజిక చైతన్యానికి వేదికగా మారాలని ఆకాంక్షించారు. సభలో పాల్గొన్న వారు ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో దేశభక్తి, స్వాభిమానాన్ని చాటాలని పిలుపునిచ్చారు.