ఈవీ ప్రియులకు బంపర్ ఆఫర్.. సబ్సిడీ పెంపుతో దూసుకెళ్తున్న ఓలా, ఏథర్ షేర్లు..!
Ola Electric Share Price: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ పక్కా ప్రణాళికతో ముందడుగు వేసింది. మొదట 2026 వరకే పరిమితం చేయాలనుకున్న సబ్సిడీ సదుపాయాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈవీ ప్రియులకు బంపర్ ఆఫర్.. సబ్సిడీ పెంపుతో దూసుకెళ్తున్న ఓలా, ఏథర్ షేర్లు..!
Ola Electric Share Price: ఎలక్ట్రిక్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఇచ్చే సబ్సిడీలను 2028 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేటాయింపులు ఏకంగా రూ.11,900 కోట్లకు పెరగడంతో ఓలా, ఏథర్ వంటి ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీల షేర్లు మార్కెట్లో ఏకంగా 5 శాతం మేర లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ పక్కా ప్రణాళికతో ముందడుగు వేసింది. మొదట 2026 వరకే పరిమితం చేయాలనుకున్న సబ్సిడీ సదుపాయాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పథకం మొత్తం బడ్జెట్ పరిమితిని రూ.10,900 కోట్ల నుంచి రూ.11,900 కోట్లకు పెంచింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల ప్రోత్సాహకాల కోసం గతంలో ఉన్న రూ.1,772 కోట్ల నిధులను ఏకంగా రూ.2,767 కోట్లకు పెంచడం గమనార్హం. ఈ నిర్ణయంతో సబ్సిడీ పొందే వాహనాల సంఖ్య 24 లక్షల నుంచి ఏకంగా 45.7 లక్షలకు చేరింది.
పరుగుడు తీస్తున్న పెట్రోల్ భారం.. ఎలక్ట్రిక్ వైపే చూపు..
నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో సామాన్యుడి జేబుకు పెద్ద రంధ్రమే పడుతోంది. ఈ క్రమంలో చౌకైన ప్రయాణం, పర్యావరణహితం అనే అంశాలు వాహనదారులను ఈవీల వైపు వేగంగా ఆకర్షిస్తున్నాయి. చార్జింగ్ మౌలిక సదుపాయాలు విస్తరించడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.5 లక్షలుగా ఉన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్ అమ్మకాలు 2026 నాటికి ఏకంగా 14.6 లక్షలకు చేరుకోవడం విశేషం. ఇదే సమయంలో సాంప్రదాయ పెట్రోల్ బండ్ల విక్రయాలు పడిపోతూ వస్తున్నాయి.
మార్కెట్లో రేసు.. ఏథర్ జోరు, ఓలాకు ప్రతికూల గాలులు..
కేంద్రం నిర్ణయంతో షేర్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ కౌంటర్లు 5 శాతం దాకా పెరిగాయి. అయితే తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో మాత్రం ఈ రెండు దిగ్గజాల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. ఏథర్ ఎనర్జీ ఆదాయం ఏటా 88.8 శాతం వృద్ధితో రూ.1,217 కోట్లకు చేరింది. అంతేకాకుండా తన నష్టాలను రూ.178 కోట్ల నుంచి రూ.51 కోట్లకు తగ్గించుకుని తొలిసారి ఈబిట్డా (EBITDA) బ్రేక్ ഈవెన్ సాధించింది.
మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ ఆదాయం ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. కంపెనీ ఆదాయం 45 శాతం క్షీణించి రూ.455 కోట్లకు పరిమితమైంది. ఓలా నికర నష్టం రూ.336 కోట్లుగా నమోదైంది. వరుసగా ఏడో త్రైమాసికంలోనూ ఆదాయ పతనం కొనసాగడం, డిస్కౌంట్లు ఇస్తున్నప్పటికీ అమ్మకాల్లో ఆశించిన పురోగతి లేకపోవడం ఓలాను కాస్త కలవరపెడుతోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సుదీర్ఘ పొడిగింపు నిర్ణయం రాబోయే రోజుల్లో దేశంలో ఈవీ విప్లవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశముంది. పెరిగిన సబ్సిడీ మద్దతుతో సగటు వాహనదారుడికి ఎలక్ట్రిక్ బండ్లు మరింత చౌకగా అందుబాటులోకి రానున్నాయి.