Hyundai : సింగిల్ ఛార్జ్తో 500 కిమీ.. రూ.15 లక్షల బడ్జెట్లో 3 కొత్త కార్లను తెస్తున్న హ్యుందాయ్
Hyundai : హ్యుందాయ్ రూ. 15 లక్షల బడ్జెట్లో 3 కొత్త ఎస్యూవీలను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
Hyundai
Hyundai : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ తయారుచేసిన వెన్యూ, క్రెటా, ఎక్స్టర్ మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. పెరుగుతున్న వినియోగదారుల అవసరాలు, కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రాబోయే కొద్ది సంవత్సరాల్లో రూ. 15 లక్షల ధరల కేటగిరీలో 3 కొత్త ఎస్యూవీలను మార్కెట్లోకి తేడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వీటిలో పెట్రోల్, డీజెల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ ఆప్షన్లు ఉండేలా ప్లాన్ చేస్తోంది.
నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ తన టాప్ సెల్లింగ్ మోడల్ అయిన క్రెటాలో థర్డ్ జనరేషన్ మోడల్ను పరిచయం చేయడానికి టెస్టింగ్ మొదలుపెట్టింది. ఇది 2027 నాటికి లాంచ్ అయ్యే అవకాశముంది. సరికొత్త క్రెటా మోడల్ మరింత బాక్సీ డిజైన్, ఫ్లాట్ బాడీ సర్ఫేస్, 4.5 మీటర్ల భారీ పొడవుతో రాబోతోంది. దీనిని కే3 (K3) ప్లాట్ఫారమ్పై డిజైన్ చేస్తున్నారు. కేబిన్ విషయానికొస్తే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్, పవర్ఫుల్ AI వాయిస్ అసిస్టెంట్, OTA అప్డేట్స్, అధునాతన లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంజిన్ పరంగా పెట్రోల్, డీజెల్తో పాటు తొలిసారిగా 'స్ట్రాంగ్ హైబ్రిడ్' ఆప్షన్ రానుండటం విశేషం.
హ్యుందాయ్ బేయాన్
హ్యుందాయ్ లైన్-అప్లో వెన్యూ కారుకు, క్రెటాకు మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేసేందుకు బేయాన్ అనే కొత్త ఎస్యూవీని తీసుకొస్తోంది. ఇప్పటికే విదేశీ మార్కెట్లలో లభిస్తున్న ఈ మోడల్ను భారత రోడ్లపై కూడా టెస్టింగ్ చేస్తున్నారు. ఇందులో స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్లాంప్స్, పెద్ద ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ లుక్ ఉండనున్నాయి. కేబిన్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూలింక్ కనెక్టివిటీ ఆప్షన్లు రానున్నాయి. దీనిలో 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజెల్ ఇంజిన్లను అందించే అవకాశముంది.
టాటా, మహీంద్రా ఈవీలకు పోటీగా కొత్త కాంపాక్ట్ ఈవీ
హ్యుందాయ్ కంపెనీ మాస్-మార్కెట్ ఈవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని డెవలప్ చేస్తోంది. దీనిని క్రెటా ఈవీ కంటే తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తారు. స్థానికంగానే విడిభాగాల తయారీ చేపట్టి ధరను అందరికీ అందుబాటులో ఉంచనున్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ సింగిల్ ఛార్జ్పై ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి.