Weather Update: హీట్ వార్నింగ్.. రానున్న 90 రోజులు నిప్పుల కుంపటే!

Weather Update: రాష్ట్రంలో రానున్న మూడు నెలలు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి హెచ్చరించారు.

Update: 2026-03-25 12:35 GMT

Weather Update: హీట్ వార్నింగ్.. రానున్న 90 రోజులు నిప్పుల కుంపటే!

Weather Update: రాష్ట్రంలో రానున్న మూడు నెలలు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి హెచ్చరించారు. అమరావతిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పరిస్థితులను విశ్లేషించిన ఆమె, ముందస్తు చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదైతే దానిని హీట్ వేవ్‌గా పరిగణిస్తారని, 6 డిగ్రీలకు పైగా పెరిగితే తీవ్ర వడగాల్పుల పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా కూలీలు, బహిరంగంగా పనిచేసే కార్మికులు ఉదయం 11 గంటల లోపు పనులు ముగించుకోవాలని అధికారులు సూచించారు. పని చేసే ప్రదేశాల్లో తాగునీరు, మజ్జిగ, టెంట్లు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల వద్ద తగిన తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు కల్పించాలని విద్యాశాఖకు సూచించారు.

త్రాగునీటి కొరత ఎక్కడా తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జలవనరుల శాఖలను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ నిరంతర నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే పశువులకు ఎండల ప్రభావం తక్కువగా ఉండేందుకు గ్రామాల్లో నీటి తొట్టెలను ట్యాంకర్ల ద్వారా నింపాలని పశుసంవర్ధక శాఖకు సూచించారు.

విద్యుత్ సరఫరా విషయంలో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాన్స్కో అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. ఎండల సమయంలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున నిరంతర సరఫరా అత్యంత కీలకమని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-2026 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజల్లో అవగాహన పెంచడం కోసం విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ఎక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందో ముందుగానే సమాచారం అందించేందుకు ఎస్‌ఎంఎస్, సోషల్ మీడియా ద్వారా అలర్టులు జారీ చేయాలని విపత్తుల నిర్వహణ సంస్థకు ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో నోడల్ అధికారులను నియమించి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.

వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రజలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. బయటకు వెళ్లేటప్పుడు తలకు కప్పు, గొడుగు వంటి రక్షణ తీసుకోవాలి. శరీరంలో నీటి లోపం రాకుండా తరచుగా నీరు తాగాలి. పళ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

అలాగే శరీరంలో లవణాల సమతుల్యత కోల్పోకుండా కొద్దిగా ఉప్పు కలిపిన ద్రవాలు తీసుకోవాలని సూచించారు. కూల్ డ్రింక్స్‌కు బదులుగా సహజ పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా సూచించారు.

ప్రజలు ఎండ తీవ్రతపై సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. రాబోయే మూడు నెలలు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రభుత్వం, ప్రజలు కలిసి అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News