తెలంగాణలో ఐదు రోజుల పాటు కురవనున్న వర్షాలు

Update: 2020-06-16 12:48 GMT

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో రానున్న‌ ఐదు రోజులపాటు వర్షాలు ఇలాగే కొనసాగనున్నాయని, ఈ ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, కుమ్రం భీం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. నైరుతి రుతుపవనాల చురుకుదనంవల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఈ నైరుతి రుతుపవనాలు తెలంగాణ‌తోపాటు పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో జూన్ 19న‌ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మధ్య ఉపరితల‌ ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.  

Tags:    

Similar News