నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలు

Telangana: సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ల నియామకం

Update: 2024-02-02 04:31 GMT

నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలు

Telangana: తెలంగాణలో సర్పంచ్‌ల పాలనకు తెర పడింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 12 వేల 769 పంచాయతీలకు కలెక్టర్లు ప్రత్యేక అధికారులను నియమించారు. తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయాధికారి, ఎంఈవో, మండల పంచాయతీ అధికారి స్థాయి సిబ్బందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. సర్పంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు నిర్వహించాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వుల్లో తెలిపారు.

ప్రస్తుతం డిజిటల్‌ సంతకాల కీలు, పెన్‌డ్రైవ్‌ల రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోనున్నారు. ఇవాళ విధుల్లో చేరనున్న ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం డిజిటల్‌ సంతకాల కీలను ఇచ్చింది. ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్‌ చెక్‌పవర్‌ కొనసాగింది. అయితే నేటి నుంచి ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్‌ చెక్‌పవర్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారుల సంతకాలతో నిధులు డ్రా చేసుకొని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. 

Tags:    

Similar News