కొలువులకు అభ్యర్థుల కొరత..
ప్రస్తుత కాలంలో నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రయివేటు రంగంలో కానీ నోటిఫికేషన్ జారీ అయితే చాలు లక్షల్లో నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ప్రస్తుత కాలంలో నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రయివేటు రంగంలో కానీ నోటిఫికేషన్ జారీ అయితే చాలు లక్షల్లో నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్క ఉద్యోగానికి 100 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా ఒక జిల్లాలో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కౌన్సెలింగ్కు పిలిస్తే 60శాతం మంది కూడా హాజరుకాలేదు. ఇప్పటి వరకూ మూడు సార్లు కౌన్సిలింగ్ నిర్వహించినా ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ కాలేదు.
పూర్తివివరాల్లోకెళ్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు 2018లో నోటిఫికేషన్ జారీ చేసారు. అందులో పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి చాలామందికి పోస్టింగ్లు ఇచ్చారు.
కాగా ఈ విద్యాసంవత్సరంలో కేజీబీవీల్లో ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలల సంఖ్య రెట్టింపు చేసింది. దీంతో మరి కొన్ని పోస్టులు ఖాళీ ఉండడంతో వాటిని భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టారు. కాగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిలింగ్కూ అభ్యర్థు సంఖ్య తక్కువగా రావడంతో, శనివారం మరో సారి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ 216 పోస్టులకు గాను కేవలం 130 మంది మాత్రమే కౌన్సిలింగ్ లకు హాజరయ్యారు.
దీంతో చాలా పోస్టులు ఖాళీగానే ఉండడంతోఅధికారులు యోచనలో పడ్డారు. మొత్తం 86 పోస్టులకు మరోసారి కౌన్సిలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం, కలెక్టర్లతో అనుమతి వచ్చిన వెంటనే మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియను కేవలం వారం రోజులు మాత్రమే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం నిర్వహించిన కౌన్సెలింగ్కు హాజరైన అభ్యర్థులు ఈనెల 4న నియామక ఉత్తర్వులు అందజేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు అంటున్నారు.