తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని, ఆర్టికల్-3 లేకపోతే అసలు రాష్ట్ర విభజనే జరిగి ఉండేది కాదని వీహెచ్ అన్నారు. అలాంటిది పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తే కేసీఆర్ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తిరిగి ప్రతిష్టించేందుకు తీసుకొచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని లాకప్లో పెట్టారని ఆయనేమైనా దేశద్రోహా అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ఎంపీలు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడరని వీహెచ్ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై ఈనెల 11న ఢిల్లీ జంతర్ మంతర్లో నిరాహారదీక్షకు కూర్చుంటానని వీహెచ్ ప్రకటించారు.