నేడు హైకోర్టులో ఆర్టీసీ భవితవ్యం తేలనుంది. ఆర్టీసీ సమ్మెపై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇవాళ్టి విచారణపై అందిరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపైనా ఈ రోజే విచారణ చేపట్టనుంది. 5 వేల ఒక వంద రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుండగా ఆర్టీసీ సమ్మె పిటిషన్పై మధ్యాహ్నం విచారణ చేయనుంది ఉన్నత న్యాయస్థానం. అధికారుల నివేదికలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం మీరు తేల్చుతారా లేక మమ్మల్ని తేల్చమంటారా అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని సమస్యకు పరిష్కారం చూపాలని గత విచారణలో సూచించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది ప్రభుత్వం. విలీనంపై మొండిపట్టు పడితే చర్చలు సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది. అయితే 47 కోట్లు చెల్లించినంత మాత్రాన ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు తొలిగిపోవు అని పేర్కొంది. గతంలో ఆర్టీసీ రక్షణకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం ఇబ్బందుల దృష్ట్యా బడ్జెట్లో ఎక్కువ మొత్తం కేటాయించలేకపోతున్నామని తెలిపింది. విలీనం సహా పలు డిమాండ్లపై చర్చలకు పట్టుబట్టడంతో చర్చలు విఫలమయ్యాయని కోర్టుకు తెలిపింది. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హై అలర్ట్ ఉందని ఆ సమయంలో ఆర్టీసీ జేఏసీ సకల జనుల సామూహిక దీక్షలకు పిలుపునిచ్చిందని అఫిడవిట్లో పేర్కొంది.
ఇవాళ్టి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన తెలపాలని నిర్ణయించింది. అలాగే రేపట్నుంచి ఆర్టీసీ జేఏసీ ముఖ్యనేతలు నిరవధిక దీక్షలకు దిగనున్నారు. ఈనెల 13, 14న ఢిల్లీలో మానవహక్కుల కమిషన్ను కలవనున్నారు.18న సడక్ బంద్ కార్యక్రమాన్ని తలపెట్టింది ఆర్టీసీ జేఏసీ. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.