నాగర్కర్నూల్ టీఆర్ఎస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో పెంట్లవెల్లి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి, మాజీమంత్రి జూపల్లి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎంపీపీగా పెంట్లపల్లి నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన జూపల్లి మద్దతుదారుడు రాజేశ్, గోస్లాపూర్ ఎంపీటీసీ అయిన హర్షవర్ధన్రెడ్డి మద్దతురాలు శిరీష పోటీ పడ్డారు. అయితే పార్టీ తరపున శిరీషను ఎంపీపీ చెయ్యాలని మరెవరూ నామినేషన్ వేయొద్దని ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి విప్ జారీచేశారు. అయినా జూపల్లి మద్దతుదారుడు రాజేశ్ నామినేషన్ వేసేందుకు మండల పరిషత్ కార్యాలయానికి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు.