రాష్ట్ర మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించేందుకు సీఎం కె.చంద్రశేఖర్రావు ముహూర్తం నిర్ణయించారు. ఇవాళ దశమి మంచిరోజు కావడంతో నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని శనివారం రాత్రి సీఎం ఆదేశించారు. ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్న తమిళిసై సౌందరరాజన్కు మంత్రివర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెలియజేశారు. సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది.
ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం కేసీఆర్తోపాటు మరో 10 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి మంత్రిమండలిలో చోటుకల్పించేందుకు అవకాశం ఉండటంతో పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతమున్న మంత్రులను కొనసాగిస్తూనే కొత్తగా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై సీఎం కసరత్తు పూర్తి చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ , పువ్వాడ అజయ్ కుమార్ శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ పేర్లు ఖరారయ్యాయి.
ఈ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక రాత్రి 7 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2019–20కి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించనుంది. మంత్రిమండలి సమావేశానికి ముందే నూతన మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు కొందరు మంత్రుల శాఖలను సీఎం కేసీఆర్ పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. కేటీఆర్కు మరోసారి కీలకమైన ఐటీ, పరిశ్రమలశాఖ దక్కే అవకాశాలు ఉండగా నీటిపారుదల, ఆర్థికశాఖల్లో ఏదో ఒకటి హరీశ్కు కేటాయిస్తారని సమాచారం.