మృత్యువులోనూ వీడని స్నేహం...
ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్నేహితులను మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ అలాంటి స్నేహితులు నిజజీవితంలో ఉంటారని ఈ ముగ్గురు మిత్రులు నిరూపించారు.
ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్నేహితులను మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ అలాంటి స్నేహితులు నిజజీవితంలో ఉంటారని ఈ ముగ్గురు మిత్రులు నిరూపించారు. చిన్నప్పటి నుంచి ఒకరి కష్టసుఖాలను ఇకరు పంచుకుంటూ కలిసి మెలిసి బతికారు, ఇప్పుడు చావులో కూడా ఒకటిగానే ఉన్నారు. అయితే ఆ ముగ్గురూ మిత్రులు పేద కుటుంబానికి చెందిన వారే. పక్కపక్క గ్రామాల్లో ఉండే ఆ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసారు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలిచేవారు. కాగా ఆ ముగ్గురు మిత్రుల్లో ఇద్దరు ఒకే చోట డిగ్రీ పూర్తి చేయగా, మరో యువకుడు ఎంబీఏ పూర్తిచేసాడు. డిగ్రీలో వేరు వేరుగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నప్పటికీ వారి స్నేహం మాత్రం అలాగే ఉంది. విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న వారు ఉపాధి వేటలో పడ్డారు. ఓ ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
వారు ఉద్యోగ ప్రయత్నం చేసే సమయానికి లాక్ డౌన్ పడడంతో ప్రయత్నం విఫలయం అయింది. అయినా వెనకడుగు వేయకుండా కుటుంబాని తోడుగా ఉండడానికి నెల క్రితం ముగ్గురూ ఓ ఇసుక క్వారీలో పనికి కుదిరారు. అక్కడే పనిచేసుకుంటూ, అక్కడే ఉండేవారు. పని బాగా నడుస్తున్న సమయంలో వర్షాలు ప్రారంభం కావడంతో ఇసుక క్వారీల్లో పని ఆగిపోయింది. దీంతో ఆ ముగ్గురు మిత్రులు నెల రోజుల పాటు కష్టపడి పనిచేసిన జీతం తీసుకుని ద్విచక్రవాహనంపై ఆనందంగా ఇంటికి బయల్దేరారు. కాగా వారి ఆనందం కొద్ది క్షణాల్లోనే అంతం అయింది. ఆ ముగ్గురు స్నేహితులను కబలించడానికి మృత్యువు లారీ రూపంలో వచ్చింది. ప్రాణాలను తీయగలిగింది కానీ.. స్నేహాన్ని మాత్రం విడదీయలేకపోయింది. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన పూర్తివివరాల్లోకెళితే జూలపల్లి మండలం అబ్బాపూర్ చెందిన రజనీకాంత్(26), మిట్ట మధుకర్(26), బాలరాజుపల్లికి అడప సురేశ్(24)లు నెల కిత్రం జయశంకర్భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ ఇసుక క్వారీలో సూపర్వైజర్లుగా పనికి కుదిరారు. కాగా ప్రస్తుతం వర్షాలు పడుతున్న కారణంగా క్వారీలో పని ఆగిపోయింది. దీంతో ఆ ముగ్గురు యువకులు సోమవారం ద్విచక్రవాహనంపై ముగ్గురు ఇళ్లకు బయలుదేరారు. వారు మంథని సమీపంలో రాగానే మున్సిపాలిటీ పరిధి కూచిరాజ్పల్లి శివారులో ఎదురుగా నుంచి వస్తున లారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రజనీకాంత్, మధుకర్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సురేశ్ను స్థానికులు మంథని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల శరీర భాగాలు బయటపడి రోడ్డంతా రక్తసిక్తమైంది. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే సమీపంలో వ్యవసాయ పనులు నిర్వహిస్తున్నవారు సమాచారాన్ని పోలీసులు చేరవేశారు. దీంతో మంథని సీఐ మహేందర్, ఎస్సై ఓంకార్ యాదవ్, రామగిరి ఎస్సై మహేందర్ మృతదేహాలను అంబులెన్స్లో ఎక్కించి పోస్టుమార్టంకు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.