హైదరాబాద్ లో వందేళ్ల లో రెండోసారి..అతి పెద్ద వాన!

Update: 2020-10-14 07:51 GMT

హైదరాబాద్ నగరంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం అంతా జలమయం అయింది. నగరంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో భారీ వర్షపాతం నమోదయింది. నిన్న ఒక్కరోజే భాగ్యనగరంలో గరిష్టంగా 32 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. గత వందేళ్లలో ఇంత అత్యధిక వర్షపాతం నమోదవడం రెండోసారి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి శివారు ప్రాంతాలలోని కాలనీలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలెవరూ కూడా అవసరం అయితే తప్పించి బయటికి రాకూడదని హెచ్చరించింది.

చెట్లు, కటౌట్లు, హోర్డింగ్ ల కింద ఎవరూ నిలబడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు సబ్‌స్టేషన్లలోకి మంగళవారం వరద నీరు చేరింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎమర్జెన్సీ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఓల్డ్‌సిటీ అంతా అంధకారంలో ఉండిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. మల్లాపూర్‌లో కరెంట్‌ తీగలు తెగిపడి తెనాలికి చెందిన ఫణికుమార్‌ (35) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నాచారంలోని లిక్కర్స్‌ ఇండియాలో పనిచేస్తున్నాడు.

Tags:    

Similar News