అదో గ్రామం. అయితే ఏంటంటారా.. ఆ గ్రామంలో కొందరు పనుల కోసం పట్టణాలకు వలస వెళ్తే.. మరికొందరు మాత్రం కేవలం దొంగతనాలే టార్గెట్ గా పెట్టుకుని దొంగలుగా మారిపోతుంటారు. దొంగతనాల కోసమే వలస వెళ్తుంటారు. అక్కడి ఆడవాళ్లు కొందరు తల వెంట్రుకలు సేకరిస్తున్నట్టు ఆ ప్రాంతాన్ని పరిచయం చేసుకుంటారు. మగవాళ్లు మాత్రం.. పాములను ఆడిస్తూ.. దేవాలయాలపై రెక్కీ నిర్వహిస్తారు. చివరికి పక్కా ప్రణాళికతో కేవలం గుడిలో మాత్రమే దొంగతనాలు చేస్తుంటారు. వీళ్లంతా కడప జిల్లా.. కొత్త మాధవరం గ్రామంలో నివశిస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా మారిన అంతరాష్ట్ర ముఠాకు సైబరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. తెలంగాణలోని పలు జిల్లాలో 50కి పైగా దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు ఆదినారాయణ ముఠా సభ్యులు. ఈ కేసులను సీసీ కెమెరాల సహాయంతో ఛేదించిన పోలీసులు.. ప్రధాన నిందితుడితో పాటు.. ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి సుమారు 60 గ్రామలు బంగారు ఆభరణాలు, 3 కేజీల 26 గ్రాముల వెండి ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.