ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా చేస్తున్న సమ్మె కారణంగా వారి కుటుంబాలు ఆర్థకంగా చాలా వెనకబడిపోతున్నాయి. కనీసం వారి కుటుంబాలలో పూట గడవడం కూడా కష్టంగా మారుతుంది. అయితే అందరి దగ్గరా భిక్షాటన చేసి పూటగడుపునే ఓ యాచకురాలు కార్మికుల బాధలు చూడలేక తన వంతు సాయంగా ఆర్టీసీ కార్మికులకు కొంత నగదు ఇచ్చింది.
వివరాల్లోకెళితే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావూడి తండాకు చెందిన సైదమ్మ ఆర్టీసీ బస్టాండ్లో 30 ఏళ్లుగా భిక్షాటన చేస్తోంది. అక్కడ పనిచేస్తు్న్న ఆర్టీసీ కార్మికులంతా ఆ యాచకురాలికి తెలిసినవారే. తాను చేయి చాచి యాచించగానే ఎప్పుడో ఒకప్పుడు, ఎంతో కొంత సాయం చేసిన వారే. 40 రోజులకు పైగా కార్మికులు సమ్మె చేస్తుండడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా దిగజారాయి.
అది చూడలేని ఈ యాచకురాలు కార్మికులకు ఎంతో కొంత సాయం చేయాలని అనుకుంది. తాను భిక్షాటన చేసి పోగేసిన రూ.4 వేల నగదును వారికి అందించింది. ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సమ్మెలో భాగంగా కార్మికులు దీక్ష చేపట్టిన టెంటు వద్దకు వెళ్లి ఆర్టీసీ నల్లగొండ జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్కు రూ.4 వేలు అందజేసింది.
అనంతరం ఆమె మాట్లాడుతూ తాను 30 ఏళ్లుగా బస్టాండ్లో ఉంటూ యాచిస్తున్నానని, ఆర్టీసీ కార్మికులంతా తనకు పరిచయస్తులు అని, వారి కడుపులు మాడుతుంటే తనకు ఎంతో బాధగా ఉందని తెలిపింది. దీంతో అక్కడున్న వారు ఆమెను అభినందించారు.