LockDown Effect: టీఎస్ఆర్జేసీ ప్రవేశపరీక్ష వాయిదా
లాక్ డౌన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.
లాక్ డౌన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్-2020ని వాయిదా వేశారు. ఈ విషయాన్ని గురుకుల విద్యాలయాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి యేడాది గురుకుల విద్యాలయ సంస్థ ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. ఇదే కోణంలో ఈ ఏడాది కూడా ఈ పరీక్షను నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో భాగంగా తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. మే 10న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో పరీక్షలు వాయిదా వేశారు. ఈ లాక్డౌన్ రాష్ట్రంలో ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందో తెలియక పరీక్షను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. తిరిగి ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారో అన్న విషయాన్ని తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ ప్రవేశపరీక్షను రాయాలనుకున్న అభ్యర్థులు మే 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.