Telangana MLAs Defection Case: ముగింపు దశకు ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం.. నేడు స్పీకర్ ముందుకు దానం నాగేందర్ కేసు!

Telangana MLAs Defection Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది.

Update: 2026-02-18 05:19 GMT

Telangana MLAs Defection Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ కేసులపై విచారణను వేగవంతం చేశారు. నేడు (బుధవారం) ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక విచారణ జరపనున్నారు.

పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల జాబితాలో ఇప్పటికే ఎనిమిది మందిపై విచారణ ప్రక్రియ పూర్తయ్యింది. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం, సదరు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ 'క్లీన్ చిట్' ఇచ్చారు. దీంతో వారందరికీ ఊరట లభించినట్లయింది.

ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారడాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్షాలు రెండు వేర్వేరు అనర్హత పిటిషన్లను దాఖలు చేశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేయగా.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను నేడు స్పీకర్ తన ఛాంబర్‌లో విచారించి, ఇరు పక్షాల వాదనలను విననున్నారు.

మరోవైపు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ రేపు (గురువారం) విచారణకు స్వీకరించనున్నారు. ఈ వరుస విచారణలతో తెలంగాణ అసెంబ్లీ వర్గాల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపుల కేసులో స్పీకర్ తీసుకోబోయే తుది నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Tags:    

Similar News