చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో హైదరాబాద్ నగరంలో వర్షాలు పడ్డాయని, వరదలు వచ్చాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో అక్రమ కట్టడాలు కట్టడం వల్లే ఇంత భారీ వరదలు వచ్చాయని విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. వరదల్లో నష్టపోయిన ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కట్టిన భవనాలన్నీ చట్టానికి లోబడి రూల్స్ ప్రకారమే కట్టిన కట్టడాలని తెలిపారు. ఇప్పడు ఆరోపణలు చేస్తోన్న నేతల హయాంలోనే అక్రమ కట్టడాలు నిర్మించారని పేర్కొన్నారు. వరద ముంపు ప్రజలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్కు గ్రేటర్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ముఖ్యమంత్రి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. 80మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని కేటీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు.
అనంతరం హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ 1908 తర్వాత మళ్లీ అలాంటి వరదలు హైదరాబాద్ను ముంచెత్తాయని అన్నారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షసూచన ఉందని, ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజల్లోనూ ఉంటున్నారని తెలిపారు. 550 కోట్లు నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. వరదల్లో ఉన్న ప్రజల కోసం మంత్రులతో సహా కార్పొరేటర్లు 24 గంటలు పనిచేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు.