Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు

Hussain Sagar: *హుస్సేన్‌సాగర్‌ పరిసరాలలో 24 క్రేన్‌లు *చెరువులు, బేబీ పాండ్స్‌ వద్ద 300 క్రేన్‌ల ఏర్పాటు

Update: 2021-09-17 03:42 GMT

హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు

Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జానికి ఆటంకాలు తొలగడంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 19న నిర్వహించే గణేష్ శోభాయాత్రకు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. శోభాయాత్ర, నిమజ్జనం పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రధాన నీటివనరు హుస్సేన్‌సాగర్ పరిసరాలలో 24 క్రేన్‌లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని నిమజ్జనం కోసం గుర్తించిన చెరువులు, బేబీ పాండ్స్ వద్ద 300 క్రేన్‌లను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఆయా చెరువుల వద్ద వంద మంది గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచనున్నారు. ఇక నిమజ్జనం కోసం విగ్రహాలను తరలించేందుకు మండపాల నిర్వహకులకు అవసరమైన వాహనాలను 10 పాయింట్స్‌లలో అందుబాటులో ఉంచనున్నారు. వీటి పర్యవేక్షణ కోసం 30 మంది ఆర్టీఏ అధికారులు, ఇన్‌స్పెక్టర్‌లను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు.

ఇప్పటికే విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే రహదారులలో అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను, చెట్ల కొమ్మలను తొలగించారు. ట్రాపిక్ పోలీసు, ఆర్‌అండ్‌బి శాఖల అధికారుల సమన్వయంతో వ్యవహరించి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, వాహనదారులు, భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాపిక్ డైవర్షన్, అవసరమైన ప్రాంతాలలో మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలలో, శోభాయాత్ర నిర్వహించే రహదారులలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణ జరిగేలా 8వేల,160 మంది సిబ్బందితో శానిటరీ సూపర్‌వైజర్ లేదా ఎస్ఎఫ్ఏ‌ల ఆధ్వర్యంలో 215 ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు 27వేల,955 మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితో పాటు ఆక్టోపస్ దళాలు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కూడా నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, బేగంపేట రైల్వే‌స్టేషన్‌ల నుండి ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైళ్ళను నడపనుంది.

Tags:    

Similar News