కేన్సర్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తూనే ఉంది. ఇప్పటి వరకు కోవిడ్ కేసులు దేశంలో అధికారికంగా 81 నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తూనే ఉంది. ఇప్పటి వరకు కోవిడ్ కేసులు దేశంలో అధికారికంగా 81 నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి దాటికి 5వేల మందిపైగా మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం నుంచి తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో శుక్రవారం మొదలైన ఇండియన్ కోఆపరేటివ్ ఆంకాలజీ నెట్వర్క్ (ఐకాన్) సదస్సుకు గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ ప్రకటన చేసారు. అనంతంరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది భారతీయులు ఉచిత వైద్య సేవలను అందుకుంటున్నారని తెలిపారు. ఈ ఆయుశ్మాన్ భారతిలో ఎంతో మందిని బలిగొన్న కేన్సర్ వ్యాధికి కూడా చికిత్స ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం లేదని ఆమె తెలిపారు.
కేన్సర్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందన్నారు. తెలంగాణలో కూడా ఎంతో మంది కాన్సర్ ద్వారా ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ లో కేన్సర్ చికిత్సను కూడా చేర్చేందుకు ప్రయత్నిస్తానని ఆమె హామీ ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి 42 ఏళ్లుగా కేన్సర్ విషయంలో విశేష కృషి చేస్తున్న ఐకాన్ సంస్థ ప్రజా చైతన్యం విషయంలో చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పర్వేశ్ పారీఖ్, ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రి డాక్టర్ సాయిరామ్, సీనియర్ ఆంకాలజిస్ట్ కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.