గేటెడ్ కమ్యూనిటీకి అటవీశాఖ జరిమానా
మొక్కలను విరివిగా నాటి రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంటే కొంత మంది మాత్రం చెట్లను నిర్ధాక్షిన్నంగా కొట్టేస్తున్నారు.
మొక్కలను విరివిగా నాటి రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంటే కొంత మంది మాత్రం చెట్లను నిర్ధాక్షిన్నంగా కొట్టేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇటీవలే ఓ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా అనుమతి లేకుండా చెట్లను కొట్టేస్తే వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలోనే అనుమతి లేకుండా చెట్లు కొట్టేసిన గేటెడ్ కమ్యూనిటీకి అటవీశాఖ అధికారులు జరిమానా విధించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెట్లను కొట్టేసిన గేటెడ్ కమ్యూనిటీపై చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని కూకట్పల్లిలో గల ఇందు ఫార్చూన్ ఫీల్డ్లో ప్రభుత్వం అనుమతి లేకుండా 40 చెట్లను వారు కొట్టివేశారు. దీంతో విషయం తెలసుకున్న మేడ్చల్ జిల్లా అటవీ అధికారి సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఇందు ఫార్చూన్ ఫీల్డ్ కు తరలి వచ్చారు.
అనంతరం ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో భాగంగానే ఆ ప్రాంతంలో పూర్తిగా ఎన్ని చెట్లను కొట్టేశారలో సమాచారం తీసుకున్నారు. తరువాత చెట్లను ప్రభుత్వ అనుమతి లేకుండా కొట్టేసినందుకు రూ.53,900 జరిమానాను గేటెడ్ కమ్యూనిటీకి విధించారు. అంతే కాదు వారు కొట్టేసిన చెట్లకు బదులుగా 80 మొక్కలు నాటి సంరక్షించాలని షరతు విధించారు. వాల్టా చట్టం అతిక్రమణ కింద అపరాధ రుసుము, బదులుగా చెట్లు నాటాలని స్పష్టం చేశారు. ఎవరైనా సరే ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లను కొట్టేస్తే ఈ విధంగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని, వాటిని సంరక్షించాలని తెలిపారు.