ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సకాలంలో పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటలు, ఇతర అంశాలపై అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, రైతులకు దిశానిర్ధేశం చేశారు.
సకాలంలో పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటలు, ఇతర అంశాలపై అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, రైతులకు దిశానిర్ధేశం చేశారు.సోమవారం దివ్యా గార్డెన్ లో నిర్వహించిన రోహిణి కార్తెలో వరి నారు- సాగుపై అవగాహన సదస్సులో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోహిణి కార్తెలో నాట్లు వేయించేందుకు రైతులను సమాయత్తం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతులంతా రోహిణి కార్తెలోనే నాట్లు వేయాలని, రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంకోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు.
పంట సాగు విధానంలో మార్పులు రావలని, రైతులు కూడా సంప్రదాయ పంటలను కాకుండా మార్కెట్ డిమాండ్ ను బట్టి పంట సాగు చేయాలన్నారు. ప్రత్యమ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని సకాలంలో రైతులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతులు పండించే ప్రతి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఖానాపైర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, జడ్పీ చైర్ పర్సన్ కే.విజయలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జడ్పీటీసీలు, రైతులు, ఇతర ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.