కాళేశ్వరం ప్రాజెక్టులో ఓ అద్భుతఘట్టం ఆవిషృతం...కొండపోచమ్మ ఒడిలోకి గోదావరి జలాలు..
గల గల పారే గోదారి జలాలు కొండపోచమ్మ రిజర్వాయర్లోకి పరవళ్లు తొక్కాయి.
గల గల పారే గోదారి జలాలు కొండపోచమ్మ రిజర్వాయర్లోకి పరవళ్లు తొక్కాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్ దంపతులు అట్టహాసంగా కొండపోచమ్మ జలాశయాన్ని నేడు ప్రారంభించారు. ముందుగా కొండపోచమ్మ ఆలయంలో చండీయాగం, పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు, చినజీయర్ స్వామి మర్కూక్ పంప్ హౌస్ లో ఓ మోటర్ స్విచ్ ఆన్ చేసి నీటిని వదిలారు. మర్కూక్ పంప్హౌస్ నుంచి ఈ రిజర్వాయర్లోకి గోదావరి నీరు చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఓ అద్భుతఘట్టం ఆవిషృతమైంది. కొండపోచమ్మ సాగర్కి నీరు చేరికతో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. అనంతరం సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి గోదావరి జలాలకు గంగపూజ నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం కొండపోచమ్మ రిజర్వాయర్లో ప్రాజెక్టు ప్రారంభానికి ముందు నిర్వహించిన చండీ, సుదర్శన హోమాల కలశ జలాలను కలిపారు. కొండపోచమ్మ సాగర్లోకి నీరు చేరికతో ప్రాజెక్టులోని తుది 10వ దశ ఎత్తిపోతలు పూర్తి అయ్యాయి.
ఈ రోజు ప్రారంభమయిన కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ వలయాకారంలో 8 కిలో మీటర్ల మేర నిర్మించారు. ఐదు జిల్లాల పరిధిలోని గజ్వేల్, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, దుబ్బాక, భువనగిరి, పటన్చెరు, మల్కాజిగిరి నియోజకవర్గాల్లోని 26 మండలాల్లోని గ్రామాలకు ఎనిమిది ప్రధాన కాల్వల (135 కిలో మీటర్లు) ద్వారా గోదావరి జలాలను మళ్లించనున్నారు. అంతే కాకుండా నీటిని పంపింగ్ చేసేలా మూడు పాయింట్ల వద్ద పంప్ హౌజ్లను ఏర్పాటు చేశారు. దీని కోసం ఇప్పటికే రామాయంపేట, గజ్వేల్, కిష్టాపూర్, శంకరంపేట, ఉప్పరపల్లి, జగదేవ్పూర్, తుర్కపల్లి, ఎం తుర్కపల్లి కాల్వలను పూర్తిచేసారు.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి