నేటినుంచి తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

నేటినుంచి(మార్చి 6) తెలంగాణాలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు

Update: 2020-03-06 02:31 GMT
Telangana assembly

నేటినుంచి(మార్చి 6) తెలంగాణాలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఆమె గవర్నర్ భాద్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌ ఆశించినట్టుగా ఉండకపోవడంతో ఈ బడ్జెట్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ బడ్జెట్ సమావేశాలలో ఒకటి లేదా రెండు కొత్త పధకాలను ప్రవేశపెట్టే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఇక 2020_21 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం మార్చ్ 8న బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టనుంది. ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారి మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్‌ తో పోల్చుకుంటే ఈ బడ్జెట్‌లో 10 నుండి 12 శాతం వరకు పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ తుది నిర్ణయం తీసుకోనుంది. 14 లేదా 15 రోజులు ఉభయ సభలు జరిగే అవకాశం ఉంది.

గత మూడు రోజులుగా సీఎం కేసీఆర్ బడ్జెట్ కేటాయింపులు, వివిధ అంశాలపై అధికారులతో కసరత్తు చేశారు. ఇక బడ్జెట్‌లో సంక్షేమం, సాగునీరు, వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక శాసనసభ, శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కోల్పోవడంతో ఉభయ సభల్లోనూ టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ఇక ఇదే వేదికపైన ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయనుంది.  

Tags:    

Similar News