సూపర్ రోబో తయారు చేసిన ఇండియన్ రైల్వే..
ఆస్పత్రికి వచ్చిన కొవిడ్19 బాధితులను వైద్యులు ఏ విధంగా పలుకరించి సేవలు చేస్తున్నారో, ఇప్పుడు ఓ మరమనిషి కూడా అలాంటి సేవలే అందిస్తుంది.
ఆస్పత్రికి వచ్చిన కొవిడ్19 బాధితులను వైద్యులు ఏ విధంగా పలుకరించి సేవలు చేస్తున్నారో, ఇప్పుడు ఓ మరమనిషి కూడా అలాంటి సేవలే అందిస్తుంది.ఆస్పత్రికి వచ్చిన వారితో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. కరోనాపై యుద్దం చేస్తోన్న డాక్టర్లు, హెల్త్ వర్కర్స్కి కూడా సాయం చేస్తుంది. ఈ మరమనిషిని దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి చేసింది. దీనికి రైల్బోట్ లేదా ఆర్-బోట్గా నామకరణం కూడా చేసారు.
ఈ రోబోను వైఫై, మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చేస్తే చాలు ఇది వైద్యులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందించడం మాత్రమే కాదు కరోనా పేషెంట్లకు ఆహారాన్ని కూడా అందిస్తుంది. అంతే కాదు దాని ముందు ఎవరైనా చేయిపెడితే శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందో కూడా చూస్తుంది. ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటే రోబోకు ప్రత్యేకంగా ఉండే ఎర్రలైట్ వెలుగుతుంది. దీని ద్వారా కరోనా లక్షణాలు, జ్వరం ఉన్న వ్యక్తులను కనిపెట్టి వైద్యులు అప్రమత్తమై వెంటనే వారిని ఐసోలేషన్ కు పంపిస్తారు. ఈ రోబోకి పైన రియల్టైమ్ కెమెరా ఉండడం ద్వారా అది ఉన్న ప్రదేశంలోని అన్నిటిని రికార్డు చేయగలదు. దీంతో రోబో ఏ ప్రదేశంలో ఉందో కూడా ఇట్టే కనిపెట్టవచ్చు. ఈ మరమనిషికి యాప్ ఓపెన్ చేసి ఏం చేయాలో సూచనలు ఇస్తే చాలు దానికి తగ్గట్టుగా పనిచేయడం మొదలు పెడుతుంది.
ఇక ఈ మరమనిషిలో మరికొన్ని ప్రత్యేకతలు ఏంటంటే ఇది సుమారుగా 80 కిలోల కంటే ఎక్కువ బరువును మోయగలదు. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 7 గంటల పాటు నిరవధికంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది గంటకు 1కిలోమీటర్ వరకు ప్రయాణిస్తుంది. ఇందులో నైట్ ల్యాంప్, నైట్ విజన్ కెమెరాలు కూడా ఫిక్స్ చేశారు. దీని కారణంగా ఇది కరెంటు లేని ప్రదేశాల్లో కూడా సేవలను అందిచగలదు.
ఇక ఇలాంటి రోబోనే ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని గోపాల్పూర్కు చెందిన దండు భరత్కుమార్ రూపొందించాడు. ఈ రోబోట్ కు మిత్ర అనే పేరుకు కూడా పెట్టారు. అతను కిట్స్లో బీటెక్ పూర్తి చేసి, మద్రాస్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ను పూర్తి చేసాడు. తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత బెంగళూరు కేంద్రంగా బాలాజీ విశ్వనాథన్, మహాలక్ష్మితో కలిసి ఇన్వెంటో రోబోటిక్స్ కంపెనీని ప్రారంభించి సుమారుగా 30 కిపైగా రోబోలను తయారుచేసారు. ఆ రోబోలన్నీ కూడా ప్రస్తుతం వేరు వేరు రంగాలలో సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆరోగ్య మిత్ర రోబోట్ కరోనా బాధితులకు సేవలందిస్తుంది. అంతే కాదు ఈ రోబోట్ తన కంప్యూటర్ భాషలో కాకుండా సాధారణ తెలుగుభాషలోనే మాట్లాడే విధంగా ప్రోగ్రామింగ్ చేసారు. ఇది సిబ్బంది స్ధానంలో రోగులను పీరక్షించి కరోనా లక్షణాలు కనిపిస్తే వైద్యుల వద్దకు వెల్లాలని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ రోబోట్ ఫోర్టిస్ ఆస్పత్రిలో వైద్య సేవలను విజయవంతంగా అందజేస్తుంది.