SLBC Tunnel: ఎస్ఎల్ బీసీ టన్నెల్ కీలక అప్ డేట్.. అందర్నీ వెలికితీసేందుకు 5రోజులు పట్టొచ్చు
SLBC Tunnel Rescue Update : ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8మందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో 8 మంది ఎక్కడున్నారో జీబీఆర్ మిషన్ తో గుర్తించిన వారిని బయటకు తీసుకు వచ్చేందుకు మాత్రం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అక్కడ నెలకున్న ప్రతికూల పరిస్థితులే అందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు అధికారులు. ప్రమాదం జరిగిన సొరంగ మార్గం 14 కిలోమీటర్లు ఉంటుంది. 14కిలోమీటర్ల వద్దే పై నుంచి మట్టి, నీరు, బురద ఒక్కసారిగా ముంచెత్తి సెగ్మెంట్లు కుప్పకూలి ఈ ఘటన సంభవించింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు సొరంగంలో చికుక్కున్నారు. ప్రమాదం ధాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ రెండు ముక్కలుగా విడిపోయింది. వెనకభాగం అరకిలోమీటరు వరకు కొట్టుకు వచ్చింది. ముందు భాగం పూడికలో కూరుకుపోయింది. ఈ రెండింటి మధ్య 3 నుంచి 5 మీటర్ల వరకు బురద పేరుకుపోయింది. టన్నెల్ ముందు భాగంలో సొరంగం మొత్తాన్ని మూసి వేస్తూ 10 నుంచి 15మీటర్ల వరకు మట్టి నిండింది. రెండు టెన్నెల భాగాల మధ్యలో నలుగురు, టన్నెల్ ముందు భాగం కింద సుమారు 15 నుంచి 20 అడుగుల లోతులో మరో నలుగురు చిక్కుకుని ఉన్నారని రాడర్ సర్వే చెబుతోంది.
దీని ఆధారితంగా తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వుతున్న కొద్దీ ఊటనీరు వచ్చి చేరుతుండటంతో తవ్విన గుంతలు మూసుకుపోతున్నాయి. నిరంతరాయంగా ప్రవహిస్తున్న నీరు అందుకు అడ్డంకిగా మారుతోంది. సుమారు 3 నుంచి 5 మీటర్ల వరకు తవ్వితే తప్ప సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియదు. అందుకోసం సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి. టీబీఎం ముందు భాగంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.