గతంలో 120 మంది విద్యార్థులతో కళకళలాడిన ఆ పాఠశాల నేడు విద్యార్థులు లేక వెలవెలబోతోంది. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పాఠశాల మూతపడే స్థాయికి చేరుకుంది. అయితే తాను చదివిన పాఠశాల మూత పడకుండా కాపాడుకోవాలని గ్రామ సర్పంచ్ స్వయంగా ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. ఇదంతా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో జరిగింది.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుండి ఐదో తరగతి వరకూ విద్యా బోధన చేస్తారు. గత విద్యాసంవత్సరం ఉప్పరపల్లి పాఠశాలలో సుమారు 120 మంది విద్యార్థులు, 6గురు ఉపాధ్యాయులు ఉండేవారు. అయితే ఓ ఉపాధ్యాయురాలి కారణంతో విద్యాసంవత్సరం చివరిలో 4గురు ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్లిపోయారు. దీంతో మిగిలిన ఇద్దరు ఉపాధ్యాయులు శ్రీనివాస్, విజయ మధ్య సఖ్యత లేకపోవడంతో శ్రీనివాస్ డిప్యూటేషన్పై వేరే చోటుకి వెళ్లిపోయాడు. మిగిలిన ఒక ఉపాధ్యాయరాలు విజయ మెడికల్ లీవ్పై వెళ్లింది. దీంతో ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో గ్రామ సర్పంచ్ తన సొంత ఖర్చులతో విద్యావాలంటీర్ని నియమించి, చివరికి సర్పంచ్ మహేశ్వరాచారి కూడా ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు.