నూతన గవర్నర్ నియామకంపై తెలంగాణ ప్రభుత్వంలో అసంతృప్తి ఉందా..? తమిళిసై నియామకం కేసీఆర్కు ఇష్టం లేదా..? గవర్నర్ గిరిపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తుందంటూ సీపీఆర్వో రాసిన వ్యాసంపై బీజేపీ మండిపడుతోంది. సర్కారియా కమిషన్ సిఫార్సులు ఎక్కడ అతిక్రమించామో చెప్పాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ నూతన గవర్నర్పై.. ప్రభుత్వంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తమిళిసై నియామకంపై తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్వో రాసిన వ్యాసం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా తమిళిసై పేరెత్తకుండా సర్కారియా కమిషన్ సిఫార్సులను ఊటంకిస్తూ సాగిన వ్యాసంలో రాజకీయంగా చురుగ్గా ఉన్న నేతలను గవర్నర్గా నియమించకూడదనే అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా గవర్నర్ కార్యాలయాలను కేంద్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని ప్రధానంగా ఎత్తిచూపారు. అయితే దీన్ని బీజేపీ తప్పుబట్టింది.
ఓ వైపు గవర్నర్ను గౌరవిస్తూనే మరోవైపు ఆ పదవిలో ఉన్న వారిని అవమానించేలా వ్యాసాలు రాయించడాన్ని తప్పుబట్టారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.. కృష్ణ సాగర్ రావు. ఓ ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యంగ పదవిలో ఉన్న వారిపై అనుమానాలు, అపోహలున్నాయంటూ రాసే స్వేచ్ఛ ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. సర్కారియా కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా గవర్నర్ నియామకాలు జరగలేదని స్పష్టం చేశారు.
మరోవైపు గవర్నర్ల నియామకం భారత రాష్ట్రపతి చేతుల్లో ఉంటుందని దాన్ని రాజకీయాల్లోకి లాగడం భావ్యం కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర గవర్నర్గా ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినట్లు వివరించిన కేటీఆర్ సౌందర రాజన్ మంచి వ్యక్తి అని కొనియాడారు. ఇదిలాఉంటే గవర్నర్ తమిళిసై మాత్రం కేసీఆర్ పరిపాలనను కొనియాడింది. సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రశంసించారు. బంగారు తెలంగాణలో తాను కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని వెల్లడించింది. నూతన గవర్నర్ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు రాకున్నా రాజకీయ దుమారం మాత్రం రేపుతోంది.