వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలలో 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా ఇవాళ రేపు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలుగు రాష్ర్టాల్లో మూడు రోజులుగా ముసురు వాతావరణం నెలకొని ఉంది. దీంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోయాయి. వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. తెలంగాణాలో జూన్ ఒకటో తేదీ నుంచి శనివారం నాటికి సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 390.7 మిల్లీమీటర్లు మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటివరకు 381.4 ఎంఎంలు నమోదైంది. కోస్తాలో మరో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగసి పడుతున్నాయి. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.