Telangana: ఆదిలాబాద్, కుమ్రంభీమ్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో ఓటింగ్ బహిష్కరణ
Telangana: గ్రామంలో సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన
తెలంగాణలో పలు చోట్ల ఓటింగ్ బహిష్కరణ
Telangana: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే కొన్ని జిల్లా కేంద్రాల్లో ఓటింగ్ను బహిష్కరిస్తున్నారు గ్రామస్తులు. తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తేనే ఓట్తేస్తామంటూ డిమాండ్ చేస్తుండగా.. మరికొందరేమో గతంలో చేస్తానన్న అభివృద్ధి ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రభీం, నాగర్కర్నూల్ జిల్లాల్లోని పలు గ్రామాల ఓటర్లు పోలింగ్ను బహిష్కరిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బావోజిపేటలో గ్రామస్తులు ఓటింగ్ను బహిష్కరించడంతో ఓటింగ్ నిలిచిపోయింది. గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. గ్రామానికి చేరుకునేందుకు రోడ్డు వేయాలని డిమాండ్ చేయాలని, త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇక ఓటింగ్ బహిష్కరించిన గ్రామస్తులతో చర్చించేందుకు అధికారులు రంగంలోకి దిగి.. వారితో చర్చలు జరుపుతున్నారు.
అటు కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం జగన్నాథపూర్ గ్రామ పంచాయితీ పరిధి బొరిగా గ్రామస్తులు ఓటింగ్ను బహిష్కరించారు. ప్రభుత్వాలు మారిన తమ సమస్యలు మాత్రమే అలానే ఉంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేదంటూ పోలింగ్ను బహిష్కరించారు.-
ఇక నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చెంచుగూడెంలో నాలుగు రోజులుగా విద్యుత్ రావడంలేదంటూ ఓటింగ్ను బహిష్కరించారు గిరిజనులు. తమ కాలనీకి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తేనే ఓటు వేస్తామంటున్నారు. త్రాగునీరు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అటవీప్రాంతం కావడంతో ఫారెస్ట్ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. అధికారులు తమ సమస్యలను పరిష్కరించే వరకు ఓటు హక్కు వినియోగించుకోమంటూ తేల్చిచెప్పారు. దీంతో అమరగిరిలోని పోలింగ్ బూత్ నెంబర్ 262లో ఓటర్లు లేకపోవడంతో అధికారులు ఖాళీగా కూర్చుని ఎదురుచూస్తున్నారు.