Nalgonda: డబ్బులిచ్చి మరీ కొడుకును చంపించిన తల్లిదండ్రులు..
Nalgonda: కుమారుడి వికృత చేష్టలకు విసిగిపోయిన తల్లిదండ్రులు.. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించారు.
Nalgonda: కుమారుడి వికృత చేష్టలకు విసిగిపోయిన తల్లిదండ్రులు.. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. ఖమ్మానికి చెందిన క్షత్రియ రామ్ సింగ్, రాణిబాయి దంపతులకు కుమారుడు సాయినాథ్ (26), కుమార్తె ఉన్నారు. రామ్ సింగ్ సత్తుపల్లిలోని ఓ రెసిడెన్షియల్ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. కొడుకు సాయినాథ్ డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసి చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. వ్యసనాలకు బానిస అయ్యాడు. ప్రతి రోజు డబ్బులు కావాలంటూ తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవాడు. తల్లి అని కూడా చూడ కుండా ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. దీంతో కుమారుడిని చంపాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నివాసముంటున్న రాణిబాయి తమ్ముడు సత్యనారాయణసింగ్కు ఈ విషయం చెప్పారు.
దీంతో సింగ్ తనకు తెలిసిన మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ రమావత్ రవిని ఆశ్రయించాడు. అదే తండాకు చెందిన పనుగొతు నాగరాజు, బూరుగు రాంబాబు, త్రిపురారం మండలం రాజేంద్రనగర్కు చెందిన ధనావత్ సాయితో రూ.8 లక్షలకు హత్య చేసేందుకు రవి ఒప్పందం చేసుకున్నాడు. అక్టోబరు 18న సత్యనారాయణసింగ్, రవి కలిసి నల్గొండ జిల్లా కల్లేపల్లిలోని మైసమ్మ దేవాలయం వద్ద దావత్ చేసుకుందామని సాయినాథ్ను తీసుకెళ్లారు. అందరూ కలిసి మద్యం తాగి.. సాయినాథ్ మెడకు ఉరి బిగించి చంపేశారు. అనంతరం కారులో తీసుకువెళ్లి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని శూన్యపహడ్ వద్ద మూసీ నదిలో పడేసి వెళ్లిపోయారు.
గుర్తు తెలియన యువకుడిని హత్య చేసి మూసీ నదిలో వేసిన ప్రాంతంలో పోలీసు అధికారులు గుర్తించి అక్కడ నెట్వర్క్ సహయంతో కాల్ డేటాను సేకరించారు. కాల్ డేటా ఆధారంగా వివరాలను సేకరించేందుకు కొంతమందికి ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ ప్రయత్నంలో మిర్యాలగూడకు చెందిన ఒక వ్యక్తి కాల్ చేయగా అతను భయపడి అతనికి తెలిసిన ఒక వ్యక్తికి విషయాన్ని చెప్పారు. హత్యతో తనకు సంబంధం లేదని కొంతమంది ఉన్నారని చెప్పారు. దీని ఆధారంగా నిందితులను పట్టుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఈఘటనలో మృతుడి తల్లిదండ్రులు సహా మొత్తం ఏడుగురిని రిమాండ్ లోకి తీసుకున్న పోలీసులు హుజూర్నగర్ కోర్టులో హజరు పరిచారు.