Osmania University exams : ఓయూ పరీక్షల షెడ్యూల్ ఖరారు

Update: 2020-09-09 04:41 GMT

Osmania University exams : రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో నిలిచిపోయిన ఇంజినీరింగ్‌, ఫార్మసీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, బీసీఏ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ-3, 5వైడీసీ, ఎల్‌ఎల్‌ఎం, బీపీఈడీ చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో సుప్రీం కోర్టు విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ మేరకు దశలవారీగా పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ పరీక్షలకు ఈ నెల 14వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ సూచించింది. ఈ మేరకు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌.గోపాల్‌రెడ్డి అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆలస్య రుసుముతో ఈ నెల 19వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొంది. అంతే కాదు ప్రస్తుతం పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు రెండు నెలల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల కంట్రోలర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ తెలిపారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల భద్రత దృష్ట్యా తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా హాజరును తీసుకోనున్నారు. అంతే కాద దూర ప్రాంతాల్లో సెంటర్లు వేయకుండా విద్యార్థులు చదివే కళాశాలలోనే పరీక్షలు నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి డిగ్రీలోని బీఎస్సీ, బీఏ, బీకాం, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఇకపోతే చివరి ఏడాది ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 1.10 లక్షల మంది విద్యార్థులు ఉండగా వారిలో 65 వేల మంది డిగ్రీ కోర్సులో విద్యను అభ్యసిస్తుండగా మరో 20 వేల మంది సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారు. మిగిలిన 25వేల మంది విద్యార్ధులు పీజీ కోర్సులో విద్యను అభ్యసిస్తున్నారు. కరోనా జాగ్రత్తలతో యూసీ మార్గదర్శకాల మేరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News