విదేశాల్లోనూ ఆర్టీసీ కార్మికులకు మద్దతు..
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా చేపడుతున్న సమ్మె ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు విదేశాలకు కూడా పాకింది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా చేపడుతున్న సమ్మె ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు విదేశాలకు కూడా పాకింది. రాష్ట్రంలోని కొంత మంది నాయకులే కాకుండా విదేశాలలో కూడా కొంతమంది ఎన్నారైలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతున్నారు. ఇదే నేపధ్యంలోనే అమెరికాలోని కొంత మంది ఎన్నారైలు ఆర్టీసీకి మద్దతు తెలిపారు.
పూర్తివివరాల్లోకెళితే అమెరికాలోని వాషింగ్టన్లో ఆదివారం తెలంగాణ అభివృద్ధి వేదిక (టీడీఎఫ్) 20వ వార్షిక వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతున్న సమయంలో కొంత మంది ఎన్నారైలు సభలో రసాభాస చేశారు.
సభ మధ్యలో లేచి"సేవ్ ఆర్టీసీ...సేవ్ ఆర్టీసీ' అంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ విధంగా వారు నినాదాలు చేయడంతో సభలో కాసేపు గందర గోళ పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ వినోద్ కుమార్ తన ప్రసంగాన్ని ఆపకుండా ఆ గందరగోళ పరిస్థతిలోనే ముగించారు. ఈయనతో పాటు ఈ వేడుకలకు వరంగల్ గ్రామీణ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, డాక్టర్ దేవయ్య ఇతరులు హాజరయ్యారు.