తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తేల్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. సీరమ్ సర్వేలో అతి తక్కువ మందికి కరోనా సోకినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. మే 12 నుంచి 17 వరకు జనగామ, కామారెడ్డి, నల్గొండలో నమూనాలు సేకరించినట్లు వెల్లడించింది. మొత్తంగా సేకరించిన 12వందల నమూనాల్లో కేవలం నలుగురికి మాత్రమే పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొంది. హైదరాబాద్లోని 5 కంటైన్మెంట్ జోన్లలో తీసిన 500 నమూనాల్లో 15మంది కరోనా బారినపడినట్లు వివరించింది. ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తేల్చిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇదిలా ఉంటే, జీహెచ్ఎంసీలో కరోనా కట్టడి చర్యలపై కేంద్రం ఆరా తీసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. కరోనా కట్టడి చర్యలపై చర్చించింది. తెలంగాణలో కరోనా కేసులు పెరగడంపై కేంద్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విధంగా కేసులు నమోదైతే జులై 31నాటికి పరిస్థితి తీవ్రంగా మారుతుందని జీహెచ్ఎంసీ అధికారులను హెచ్చరించింది. ప్రైవేట్ పరీక్షల్లో 70 శాతం పాజిటివ్ కేసులుగా వస్తున్నాయని, కరోనా కట్టడికి హోం కంటైన్మెంట్ ఒక్కటే మార్గమని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.