MLA Rajaiah: వెక్కివెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య.. ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయండి..
MLA Rajaiah: భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
MLA Rajaiah: ఆడవారిని అడ్డుపెట్టుకుని తనపై కుట్రలు చేస్తున్నారన్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అప్పుడు, ఇప్పుడు ఎన్నికల ముందే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజయ్య. తనకు జనబలం ఉందని ఓర్వలేకనే కొంతమంది ఇలా తనపై లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. తనలో తాను కుమిలిపోతూ తన బాధను చెప్పుకుని ఎమ్మెల్యే రాజయ్య కుప్పకూలారు. ఏ సర్వే చూసినా తాను ముందు వరుసలో ఉన్నానని, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. తనను ఢీకొట్టాలంటే ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయాలని, తాడోపేడో తేల్చుకుందామని రాజయ్య సవాల్ విసిరారు.
ఎంతో ఆప్యాయంగా తాను మమతానురాగాలు పంచి పెడుతూ... మహిళల గౌరవాన్ని పెంచేలా... మగవారితో సమానంగా రాణించాలని ప్రోత్సహిస్తున్నానని అన్నారాయన వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలతోపాటు స్వపక్ష నాయకులు కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఆత్మస్థైర్యాన్ని కొల్లగొట్టేలా వ్యవహరిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా... ఎవరు ఏం చేసినా... భయపడే ప్రసక్తే లేదన్నారు.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గమే తన దేవాలయమని, ప్రజలే తనకు దేవుళ్లని అన్నారు.. తన చివరి ఊపిరి ఉన్నంతవరకు ప్రజల మధ్యనే ఉంటానని... ప్రజల మధ్యనే చస్తానని చెప్పారు ఎమ్మెల్యే రాజయ్య.