ఆ చిన్నారిని ఆదుకోండి : మంత్రి కేటీఆర్

Update: 2020-10-21 08:23 GMT

ఒకే సారి తల్లిదండ్రులతో పాటు తన తోడబుట్టిన సోదరుడిని కోల్పోయి ఓ పన్నెండేళ్ల చిన్నారి అనాథగా మిగిలింది. ఏ దిక్కూ లేకుండా ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తుంది. ఈ విషయం తెలియగానే మంత్రి కేటీఆర్ స్పందించి పన్నెండేళ్ల వందనను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను ఆదేశించారు. అయితే ఈ బాలిక గురించి ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని చదివిన మంత్రి కేటీఆర్‌ ఆ బాలికకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆ బాలిక స్థితిగతుల గురించి తెలుసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిణి సుభద్రకి మంగళవారం ఆదేశాలు జారీచేసారు. దీంతో జిల్లా సంక్షేమ అధికారిణి సుభద్ర వెంటనే వందన గ్రామానికి చేరుకుని బాలికను పరామర్శించారు. అనంతరం అక్కడి వారితో మాట్లాడి బాలిక తల్లి దశదిన కర్మలు జరిగిన తరువాత చిల్డ్రన్స్‌ వెల్ఫేర్‌ సెంటర్‌కు తరలిస్తామని తెలిపారు. తక్షణ సాయంగా రూ.30వేల నగదును ఆ బాలికకు అందించారు. ఇతర వసతుల ఏర్పాట్లపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని, అప్పటి వరకు బంధువులు, గ్రామస్తులు బాలికకు అండగా ఉండాలని కోరారు. ఆమె వెంట సీడీపీఓ కవిత, ఏసీడీపీఓ వెంకటమ్మ, సూపర్‌వైజర్‌ జ్యోతి తదితరులు ఉన్నారు.

ఇక పోతే నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామాంలో బొడ్డు అంజయ్య, తన భార్య పద్మ, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగించేవారు. అయితే రెండేళ్ల క్రితం అంజయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి తల్లి పద్మ అన్ని తానై పిల్లలను పోషిస్తూ వస్తుంది. అయితే పద్మ కుమారుడు గతేడాది ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణ పాలయ్యాడు. అటు భర్త, ఇటు కుమారుడు ఇద్దరు దూరం కావడంతో పద్మ కూడా అనారోగ్యం బారిన పడి ఇటీవల కన్నుమూసింది. దీంతో ఆమె కుమార్తె వందన ఒంటరిదైంది.

Tags:    

Similar News