దండం పెడుతూ కరోనా నివారణ పై వినూత్న ప్రచారం..
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి హరీశ్ రావు లాక్ డౌన్ ని విజయవంతం చేయాలని ప్రజలను విన్నవించారు. ఇందులో భాగంగానే సిద్దిపేటలో వినూత్న ప్రచారం చేపట్టారు. పోలీస్ శాఖ ఆధ్వర్యలో ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి దానిపై స్క్రీన్ ఏర్పాటు చేయించారు. ఆ వాహనం సిద్దిపేట నియోజకవర్గంలోని గ్రామ గ్రామాల్లో తిరుగుతూ హరీశ్ వీడియోను ప్లే చేస్తోంది. ఆ వీడియో ద్వారా మంత్రి కరోనా వైరస్ పై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి దిశానిర్ధేశం చేసారు. ప్రజలు కరోనా మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవాలని కోరారు. కరోనా అనే రోగ క్రిమి వల్ల కోవిడ్-19 అనే జబ్బు వస్తుందని తెలిపారు.
నిన్న మొన్నటి వరకు విదేశీయులకు సోకిన వైరస్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వారికి కూడా సోకుతున్నదని తెలపారు. ఇది చాలా ప్రాణాంతకమైన వైరస్ అని దీనికి వ్యాక్సిన్ ఇంకా కనుక్కోలేదు. ఇప్పుడు కేవలం ముందు జాగ్రత్తల ద్వారానే మనల్ని మనం కాపాడుకోగలిగాం అని ఆయన అన్నారు. 'చేతులు జోడించి అందర్నీ వేడుకుంటున్నా దయచేసి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు కోరారు.
2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్లో బయటపడ్డ ఈ వైరస్ ప్రస్తుతం 150 దేశాలకు పాకిందన్నారు. ఇది ఒకరి నుండి ఒకరికి సోకే భయంకరమైన అంటువ్యాధి అని తెలిపారు. ఫంక్షన్లు వాయిదా వేసుకోవాలని అన్నారు. ఎవరైనా విదేశాల నుండి వస్తే వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దయచేసి వీధుల్లోకి రావొద్దని, నాకేం అవుతుందిలే అనే మీ అజాగ్రత్తగా ఉండోద్దని తెలిపారు. మార్చి 31 వరకు అందరూ ఇళ్లల్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావొద్దన్నారు. ప్రభుత్వ ఆజ్ఞలు మీరితే జరిమానా విధించడంతో పాటు, కేసులు కూడా బుక్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు ప్రభుత్వ వ్యవస్థ అప్రమత్తంగా సేవలందిస్తుందన్నారు. పోలీసులకు సహకరిస్తూ, విజ్ఞతతో ప్రవర్తించాలని కోరారు.