లక్ష్యానికి చేరువలో మాలావత్ పూర్ణ
ఆరేళ్లలో ఆరు ఖండాలలోని 6 ఎతైన పర్వతాలను అధిరోహించి తెలంగాణకు మంచి పేరుతెచ్చి పెట్టింది మాలావత్ పూర్ణ.
ఆరేళ్లలో ఆరు ఖండాలలోని 6 ఎతైన పర్వతాలను అధిరోహించి తెలంగాణకు మంచి పేరుతెచ్చి పెట్టింది మాలావత్ పూర్ణ. అతి చిన్న వయస్సులోనే పర్వతారోహణను మొదలు పెట్టింది. పర్వతారోహణలో తనదైన శైలిలో మాలావత్ పూర్ణ మరో ఘనత సాధించింది. ఇదే నేపథ్యంలో పూర్ణ 2019లో సౌత్ అమెరికాలోని అకాంకాగ్వా పర్వతం, ఓసియానియా రీజియన్లోని కార్ట్స్నేజ్ పర్వతం, అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించి విజయాన్ని సాధించింది. ప్రపంచలోని ఎత్తయిన పర్వతాల్లో విన్సన్ మాసిఫ్(16050 అడుగులు) ఒకటి.
ఆమెకు 13 సంవత్సారాల 11 నెలల వయసున్నప్పుడు మొట్ట మొదటి సారి పర్వతారోహనను మొదలు పెట్టింది . అతి పిన్న వయసులోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన బాలికగా పూర్ణ రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతను 2014, మే 25న సాధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమెను అభినందించింది. తరువాత వరుసగా 2016లో ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని , 2017లో యూరప్లోని ఎల్బ్రస్ పర్వతాన్నిఅధిరోహించింది. ఆమె మొట్టమొదటి సారిగా పర్వతాన్ని అధిరోహించినప్పుడే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. 7 ఖండాల్లోని 7 ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనుకుంది. ఇప్పటి వరకు ఆరేళ్లలో 6 ఖండాల్లోని 6 ఎత్తయిన పర్వతాలను అధిరోహించింది లక్ష్య సాధనకు అతి చేరువలో వుంది.
2019 లో అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించి పూర్ణ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శాటిలైట్ ఫోన్ ద్వారా పూర్ణ తన సందేశాన్ని వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం సాయంతోనే తాను అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నానని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తాను కష్టపడ్డానని తెలిపింది. పర్వతారోహణ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనకు అండగా నిలిచారని పూర్ణ వారికి ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటు తనని ఎంతగానో సపోర్ట్ చేసిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆమె కోచ్ శేఖర్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ విషయంపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రపంచ పర్వతారోహణ చర్రితలో పూర్ణ లక్ష్యాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతాయన్నారు. ప్రపంచ పర్వతారోహికురాలిగా మారిన పూర్ణను చూస్తుంటే తెలంగాణకు, దేశానికి గర్వకారణంగా ఉందన్నారు. ఇలాంటి ఘనతలను మరిన్ని సాధించాలని వారు కోరారు. పూర్ణకు సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహాయ, సహకారాలు అందించారని, మరికొంత మంది విద్యార్థులకు ఇలాగే సాయం చేయాలని ప్రవీణ్ కుమార్ కోరారు.