కరోనా వైరస్ తో భయాందోళనకు గురవుతున్న ప్రజలు తమ గ్రామాల సరిహద్దుల్లో పెద్ద పెద్ద పైపులతో కంచలు వేసుకుంటున్నారు. కరోనా తగ్గే దాకా తమ ఊరికి రావద్దంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ఓ గ్రామ సరిహద్దుల్లో వేసిన పైపులు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన చింత రమేశ్ (42) ఎల్కతుర్తి మండలం జీల్గుల గ్రామంలో విద్యుత్తుశాఖలో లైన్మేన్గా పనిచేస్తున్నారు.
బుధవారం ఉగాది కావడంతో ఇంట్లోనే ఉన్నారు. విద్యుత్తుకు సంబంధించి ఎవరో ఫోన్ చేయడంతో ద్విచక్రవాహనంపై జీల్గులకు వెళ్లారు. విధులు నిర్వర్తించి సాయంత్రం 4 గంటలకు వస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొద్దిరోజులుగా తమ గ్రామానికి ఎవరూ రావద్దంటూ గ్రామ సరిహద్దు రహదారులపై ఎక్కడికక్కడ పైపులు, ముళ్ల కంపలు అడ్డంపెట్టారు. ధర్మారం వెళ్లే దారిలోనూ అలా అడ్డుగా పైపులు వేశారు. ద్విచక్రవాహనం వెళ్తున్న రమేశ్ ప్రమాదవశాత్తు ఆ పైపును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనంలో హుజూరాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.